1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (13:50 IST)

ప్రభుత్వ బడిలో చేరితే నెలకు రూ.500 నగదు - ఓ గ్రామ సర్పంచ్ ఆఫర్

schools
దేశంలో ప్రభుత్వ బడులు నిర్వీర్యమైపోతున్నాయి. దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. ఈ కారణంగా గవర్నమెంట్ స్కూల్స్‌కు ఆదరణ క్రమంగా తగ్గిపోతోంది. అయితే, ఓ గ్రామ సర్పంచ్ మాత్రం ఈ స్కూల్స్‌కు తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులోభాగంగా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. 
 
ప్రభుత్వ బడిలో చేరే చిన్నారులకు రూ.500 నగదు ప్రోత్సాహక బహుమతితో పాటు పుస్తకాలు, యూనిఫాం ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ నగదు ప్రోత్సాహక బహుమతిని ప్రతి నెలా అందించనున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఇంతకీ ఈ తరహా నిర్ణయం తీసుంది ఓ మహిళా సర్పంచ్. ఆమె పేరు కొడగూటి శారద. తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం, శాలపల్లి - ఇందిరా నగర్ సర్పంచ్. 
 
ఈ రెండు గ్రామాల్లో రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 70 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఈ యేడాది బడిబాట కార్యక్రమం ద్వారా మరో 50 మంది చిన్నారులను బడిలో చేర్పించేందుకు ఆమె కంకణం కట్టుకున్నారు. 
 
ఇందుకోసం ఈ రెండు గ్రామాల్లో ఉన్న చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే నెలకు రూ.500 చొప్పున ప్రోత్సాహక బహుమతి ఇస్తామని, స్కూల్స్ యూనిఫామ్స్, పుస్తకాలను కూడా ఉచితంగానే అందిస్తామని ఆనె ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.