శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (07:28 IST)

కడప జిల్లాలో సర్పంచ్ పదవి : రూ.8 వేలకు అమ్ముడుపోయిన ఒక్కో ఓటరు

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనేక ప్రాంతాల్లో అధికార విపక్ష పార్టీల నేతల వ్యూహాలు పన్నుతున్నారు. ఇందుకోసం అనేక గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు మెంబరు పోస్టులను వేలం వేస్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న 240 మంది ఓటర్లు.. ఒక్కో ఓటరు రూ.8 వేలకు చొప్పున అమ్ముడు పోయారు. ఈ గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీపడిన అభ్యర్థి ఏకంగా 20 లక్షల రూపాయలను ఆఫర్ చేశారు. అయితే, ఈ మొత్తాన్ని గ్రామానికి ఇవ్వనని, ఒక్కో ఓటరుకు పంచుతానని చెప్పడంతో వారు సమ్మతించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అభ్యర్థుల ప్రలోభాలు కూడా ఎక్కువైపోయాయి. గ్రామాభివృద్ధికి డబ్బులు ఇస్తానని అభ్యర్థులు ముందుకు రావడంతో చాలా గ్రామాల్లో సర్పంచ్ పదవి ఏకగ్రీవం అవుతోంది. 
 
మరికొన్ని చోట్లే పదవి కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఎవరు ఎక్కువకు పాడుకుంటే వారిని ఏకగ్రీవం చేస్తున్నారు. తద్వారా వచ్చిన సొమ్మును గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయిస్తున్నారు.
 
ఈ క్రమంలో కడప జిల్లా కమలాపురం మండలంలోని ఓ గ్రామంలో మాత్రం సర్పంచ్ అభ్యర్థి బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చాడు. ఇక్కడ సర్పంచ్ పదవి జనరల్‌కు కేటాయించారు. గ్రామంలో 240 ఓట్లు ఉన్నాయి. ఈ పంచాయతీకి రెండో దశలో ఎన్నిక జరగాల్సి ఉండగా వైసీపీకి చెందిన ఓ అభ్యర్థి పోటీకి ముందుకొచ్చాడు.
 
తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.20 లక్షలు ఇస్తానని, అయితే, ఈ సొమ్మును గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయకుండా, ఒక్కో ఓటరుకు రూ.8 వేల చొప్పున పంచుతానని హామీ ఇచ్చాడు. దీని గ్రామస్థులు సమ్మతించడంతో ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో పోటీ చేయాలని భావిస్తున్న ఇతర అభ్యర్థులను బరిలోంచి తప్పించేందుకు గ్రామ పెద్దలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.