శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 జనవరి 2021 (17:48 IST)

చెన్నైలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టు

చెన్నై నగరంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టు అయ్యారు. ఆయన్ను ఆదివారం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయనను ఎందుకు అరెస్టుచేశారని అడిగిన ప్రశ్నకు పోలీసులు నీళ్లు నములుతున్నారు. 
 
అయితే, కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న బీటెక్ రవి.. ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నారు. ఈయన ఎవరూ ఊహించని విధంగా చెన్నైలో అరెస్ట్ అయ్యారు. ఓ దళిత మహిళ హత్యను నిరసిస్తూ ర్యాలీ చేపట్టిన ఆయనను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. 
 
బీటెక్ రవి అరెస్టుకు గల కారణాలను పరిశీలిస్తే, గత నెల 18వ తేదీన కడప జిల్లా పెద్దకుడాలలో ఓ దళిత మహిళ హత్యకు గురైంది. దళిత మహిళ కుటుంబానికి న్యాయం చెయ్యాలంటూ బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఛలో పులివెందుల ర్యాలీ నిర్వహించారు.
 
అయితే, దీనిపై బాధిత దళిత మహిళ కుటుంబసభ్యులు టీడీపీ ర్యాలీకి అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య జరిగిన రెండు రోజుల్లోనే పోలీసులు నిందుతులను పట్టుకున్నారని, తమ కుటుంబానికి న్యాయం చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు ర్యాలీ చేయడం ద్వారా తమ కుటుంబ పరువుకు భంగం వాటిల్లిందని దళిత మహిళ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దాంతో పోలీసులు బీటెక్ రవి, మరో 20 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే చెన్నైలో ఉన్న బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కక్షసాధింపు రాజకీయాలకు ఈ అరెస్ట్ ఓ నిదర్శనమన్నారు. ఎస్సీ మహిళ హత్యాచారం కేసులో నిందితులను వదిలేసి, ఈ ఘటనను వెలుగులోకి తెచ్చిన టీడీపీ నేతలను అరెస్టు చేయడం ఏం న్యాయమని ప్రశ్నించారు.
 
అటు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ట్విట్టర్‌లో ఈ ఘటనపై స్పందించారు. ఛలో పులివెందుల కార్యక్రమంలో పాల్గొని మహిళల్ని కాపాడమంటూ ప్రభుత్వాన్ని నిలదీసిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని అరెస్ట్ చేశారని, ఈ అరెస్ట్‌ను తాను ఖండిస్తున్నానని తెలిపారు. పోలీసులకు, జగన్‌కు టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంపై లేకపోవడం బాధాకరమన్నారు.