1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 6 జనవరి 2023 (21:24 IST)

మానసిక వికాసానికి క్రీడలు దోహదం: కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత

image
క్రీడలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత అన్నారు. విద్యార్జనతో పాటు ప్రతి ఒక్కరూ క్రీడలలో కూడా భాగస్వాములు కావాలని సూచించారు. కాకినాడ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 25వ ”ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్”ను వంగా గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగా గీతా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, అందుకు క్రీడలు, వ్యాయామం ఎంతో దోహదం చేస్తాయన్నారు.
 
పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ క్రీడలలో పాల్గొనడమే ముఖ్యమని గెలుపు ఓటములు ప్రధానం కాదని, నేటి ఓటమి రేపటి గెలుపుకు పునాది కావాలని తెలిపారు. క్రీడా స్పూర్తితో వేసే ముందడుగు ఎప్పుడూ విజయానికి బాటలు వేస్తుందన్నారు. ఈ ప్రాంతీయ స్దాయి క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొందుతారని వివరించారు.
 
ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంయిక్త సంచాలకులు జె సత్యనారాయణ మూర్తి, ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ జనార్ధనరావు, మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ టివి రాజశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాలలోని 27 పాలిటెక్నిక్ కళాశాలల పరిధిలో ఈ ప్రాంతీయ స్పోర్ట్స్ మీట్ జరుగు తుండగా, విద్యార్దిని విద్యార్ధులు పెద్దసంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.