1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (16:52 IST)

వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ కూడా పాల్గొంటుంది : అనురాగ్ ఠాగూర్

వచ్చే 2023లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ సహా మిగిలిన అన్ని జట్లూ పాల్గొంటాయని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. అయితే, పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌ను తటస్థ వేదికపై ఆడుతామంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. 
 
వీటిపై అనురాగ్ ఠాకూర్ స్పందించారు. భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాక్‌తో సహా అన్ని పెద్ద జట్లూ పాల్గొంటాయని స్పష్టం చేశారు. 'వన్డే ప్రపంచ కప్‌ను నిర్వహించే బాధ్యత బీసీసీఐదే. అందుకే ఇది బీసీసీఐ విషయం. ఆ బోర్డే స్పందించాలి. భారత్ క్రీడలకు పవర్‌హౌస్‌లాంటిది. చాలా ప్రపంచకప్‌లను ఇక్కడ నిర్వహించాం. అలాగే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. 
 
అందులో పాక్‌తో సహా పెద్ద జట్లన్నీ తప్పకుండా పాల్గొంటాయి. భారత్‌ నుంచి క్రీడలను వేరు చేయలేం. క్రికెట్‌తో సహా చాలా క్రీడల్లో భారత్‌ పాల్గొంటుంది. పాకిస్థాన్‌లో భద్రతాపరమైన అంశాలను కేంద్ర హోం శాఖ చూసుకొంటుంది. క్రికెట్‌కు సంబంధించినదే కాకుండా ఆటగాళ్ల భద్రత కూడా చాలా కీలకం. ఎవరి మాటను వినే అవసరం భారత్‌కు లేదు. మమ్మల్ని ఎవరూ డిక్టేట్‌ చేయలేరు' అని ఆయన అన్నారు.