1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (17:17 IST)

ఐసీసీ టీ20 కప్ : దాయాదుల పోరుకు వర్షం అడ్డంకి!

cricket stadium
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో సంచలనం చోటుచేసుంది. శ్రీలంకపై క్రికెట్ పసికూన నమీబియా విజయ భేరీ మోగించింది. ఇదిలావుంటే, ఈ నెల 23వ తేదీ ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డుపడే ఆస్కారం ఉంది. దీనికి కారణం ఆస్ట్రేలియా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ వర్షాలు ఈ వారం మొత్తం కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆదివారం జరగాల్సిన హైఓల్టేజ్ మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు లేకపోలేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఆస్ట్రేలియా వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఆదివారం రోజున మెల్‌బోర్న్‌లో సుమారు 80 శాతం వర్షం పడే అవకాశం ఉంది. అది కూడా ఆ రోజున సాయంత్రం తప్పకుండా వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. బ్యూరో ఆఫ్‌ మెటరాలజీ వెబ్‌సైట్‌ ప్రకారం వచ్చే ఆదివారం మెల్‌బోర్న్‌ ఎక్కువ శాతం మేఘావృతమై ఉంటుంది. జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ఆ సైట్‌లో వర్ష సూచన చేశారు. 
 
సాయంత్రంపూట 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెదర్‌ శాఖ పేర్కొన్నది. కేవలం ఆదివారం మాత్రమే కాదు.. శుక్ర, శనివారాల్లోనూ 95 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. 
 
ముఖ్యంగా, ఇండో పాక్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేదు. ఒకవేళ వర్షం ఏకధాటిగా కురిస్తే, అప్పుడు మ్యాచ్‌ లేనట్లే అవుతుంది. సెమీస్‌, ఫైనల్స్‌కు మాత్రం రిజర్వ్‌ డేను కల్పించారు. బుధవారం బ్రిస్బేన్‌లో కివీస్‌తో జరగాల్సిన వార్మప్‌ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు అయిన విషయం తెలిసిందే.