1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (12:50 IST)

శ్రీకాకుళంలో ఉపాధికి 'లంగరు'

సముద్రంలో చేపల వేటపై నిషేధం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. జూన్‌ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేయనుంది. ఈ సమయాల్లో వేట సాగిస్తే మత్స్య సంపద దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా వేటకు విరామాన్ని ప్రకటిస్తూ వస్తోంది. చేపల వేటకు దూరంగా ఉంటున్న మత్స్యకారులకు ప్రభుత్వం 61 రోజుల కాలానికి రూ.పది వేలు భృతి చెల్లింపునకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 
 
పరిహారం చెల్లింపునకు ఈనెల 19న మత్స్యశాఖ అధికారులు సర్వే చేపట్టాలని ఆదేశించింది. ఈనెల 25న గ్రామ సచివాలయాల్లో అర్హులైన జాబితా ప్రకటించి, మే 18న వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వేట నిషేధ భృతిని 2018 వరకు మోటారు బోట్లకు పరిమితం చేయగా, గతేడాది నుంచి తెప్పలపై చేపల వేట సాగిస్తున్న వారికీ ప్రభుత్వం వర్తింపజేసింది. ఒక్కో మెటారు బోటుకు ఆరుగురు, ఒక్కో తెప్పకు ముగ్గురు చొప్పున పరిహారం చెల్లిస్తోంది. 
 
జిల్లాలోని 11 మండలాల్లో 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. చేపల వేట ప్రధాన వృత్తిగా సుమారు 25వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వేట నిషేధిత కాలపు పరిహారానికి మాత్రం అందరూ నోచుకోలేకపోతున్నారు. పడవలో గరిష్టంగా పది మంది వరకూ చేపల వేటకు వెళ్తారు. కానీ ప్రభుత్వం ఆరుగురికి మాత్రమే సాయాన్ని పరిమితం చేస్తోంది. దీంతో మిగిలిన మత్స్యకార కుటుంబాలు సాయం పొందలేకపోతున్నాయి. కుటుంబంలో ఇద్దరు ముగ్గురు వేటకు వెళ్తున్నా, అందులో ఒకరికే డబ్బులు అందిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన సాయం డబ్బులనే అందరూ కలిసి పంచుకుంటున్న పరిస్థితి ఉంది.
 
 
చేపల వేట నిషేధం నేపథ్యంలో అర్హులైన మత్స్యకారులను గుర్తించేందుకు ఈనెల 19న జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ఒకేసారి సర్వే చేపట్టనున్నారు. సర్వే కోసం బృందాలను నియమించారు. గతంలో మాదిరిగానే బోటుకు పైభాగంలో పసుపు, కింది భాగంలో నీలం రంగు వేయాలని నిబంధన విధించారు. రిజిస్ట్రేషన్‌ అయిన బోట్లకే పరిహారం చెల్లించనున్నారు. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు మాత్రమే పరిహారం పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన ఈనెల 25న అర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. మే 18న వారి ఖాతాలో డబ్బులను జమ చేయనున్నారు.
 
 
ఒక్కో మెటారు బోటుకు ఆరుగురు, ఒక్కో తెప్పకు ముగ్గురు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లిస్తోంది. గతేడాదికి సంబంధించి ఇప్పటికీ కొందరు మత్స్యకారులకు డబ్బులు అందలేదు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద జిల్లాలో 14,289 మందిని వేట నిషేధిత కాలపు భృతికి అర్హులుగా గుర్తించింది. వారిలో 70 మందికి నేటికీ పరిహారం అందలేదు. మత్స్యకారుల బ్యాంకు ఖాతాలు మనుగడలో లేకపోవడం, ఆధార్‌ నంబర్లు సరిపోకపోవడంతో వారికి నగదు జమ కాలేదు. ఈసారైనా సాంకేతిక సమస్యలను అధిగమించి పరిహారం సక్రమంగా అందేలా చూడాలని మత్స్యకారులు కోరుతున్నారు.
 
 
ఆదాయం కోల్పోయిన మత్స్యకార మహిళలు
ప్రతి ఏడాదిలో ఒకసారి వేట విరామాన్ని ప్రభుత్వం ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో చేపల వేట అమలు జరుగుతోంది. ఈ ఏడాది మార్చి నుంచే వేటకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చేపల వేట సమయంలో లభ్యమైన చేపలను మహిళలు కొనుగోలు చేసి, గ్రామాల్లో అమ్ముతుంటారు. చేపలు లభ్యతకు అనుగుణంగా వారికి రోజుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఆదాయం వచ్చేది. వేట నిషేధంతో ప్రస్తుతం అదీ రావడం లేదు. వేట నిషేధ భృతిని తమకూ అందించాలని వారంతా కోరుతున్నారు.