ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 9 నవంబరు 2021 (16:06 IST)

అనంత‌లో విద్యార్థులపై దాడికి నిరసనగా విద్యార్థి సంఘాల ధర్నా

అనంతపురం ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల విద్యార్థులపై పోలీసుల దాడులకు నిరసనగా పీ డీ ఎస్ యూ,ఏఐఎస్ఎఫ్, టిఎన్ఎస్ఎఫ్, ఎన్ ఎస్ యు ఐ, పి డి ఎస్ యు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం లెనిన్ సెంటర్ లో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పీ డీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు ఎ.రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్సన్ బాబు,టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్, పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎం. రామకృష్ణలు మాట్లాడుతూ, విద్యార్థులపై పోలీసుల దాడి అన్యాయమన్నారు.ఇది ముమ్మాటికీ ప్రభుత్వ దాడి అని దుయ్యబట్టారు.
 
 
 ఎయిడెడ్ విద్యా సంస్థలను యథాతథంగా కొనసాగించాలని విద్యార్థులు ఆందోళన చేస్తుంటే, జగన్ ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయించడం హేయమైన చర్య అని విమర్శించారు. ఎయిడెడ్ రద్దు చేయడం ద్వారా ఫీజుల భారం విద్యార్థులపై అధికంగా ఉంటుందన్నారు. మామయ్యగా అండగా ఉంటానని చెప్పిన జగన్ విద్యార్థులను చితకబాదించడం తీవ్ర గర్హనీయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అనేక రోజుల నుండి విద్యార్థులు ఎయిడెడ్  విద్యాసంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. అయినా జగన్ ప్రభుత్వం మొండిగా ప్రైవేటీకరణ చేస్తుందని విమర్శించారు.జీవోలు 42,52,35 లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
 
 
ఎయిడెడ్ విద్యా సంస్థలను యథాతథంగా కొనసాగించేంత వరకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ ధర్నా కార్యక్రమంలో పీ డీ ఎస్ యూ నగర అధ్యక్షులు ఐ. రాజేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్,టిఎన్ ఎస్ఎఫ్ నాయకులు బాబి,వంశీకృష్ణ,భాను తదితరులు పాల్గొన్నారు.