శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (15:25 IST)

ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వస్తే.. మేమంతా ఆత్మహత్య చేసుకుంటాం..

తన కుమారుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన వైకాపా బహిష్కత ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తే తామంతా సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని మృతుడు సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ప్రకటించారు. 
 
తన కారు మాజీ డ్రైవరైన సుబ్రహ్మణ్యం వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి.. మృతదేహాన్ని తీసుకెళ్లి మృతుని ఇంటి వద్ద పడేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో పోలీసులు ఎమ్మెల్సీని అరెస్టు చేశారు. 
 
ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు. అదేసమయంలో ఆయన బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. 
 
ఈ క్రమంలో సోమవారం కోర్టు విచారణకు తన కుటుంబ సభ్యులతో కలిసి మృతుని నూకరత్నం హాజరయ్యారు. ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన కుమారుడిని పొట్టనబెట్టుకున్న హంతకుడు అనంతబాబుకు బెయిల్ ఇస్తే తామంతా సామూహిక అత్యాచారం చేసుకుంటామని ప్రకటించారు. 
 
ఆయన బయటకు వస్తే అధికార పార్టీ అండతో సాక్ష్యాధారాలను తారుమారు చేయడమేకాకుండా మాఫీ చేసే అవకాశం కూడా ఉందన్నారు. అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయరాదని కోరారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ బాధిత కుటుంబం తరపున పిటిషన్ వేయగా దాన్ని కోర్టు స్వీకరించింది.