1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (08:11 IST)

పోర్న్ వీడియోల లింక్ షేర్ చేసిన సిబ్బందిపై తితిదే వేటు!

ఇటీవల శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్‌ సిబ్బంది ఓ భక్తుడుకి పోర్న్ వీడియోలకు సంబంధించిన లింక్‌ను షేర్ చేశారు. ఇటీవల ఓ భక్తుడు 'శతమానం భవతి' కార్యక్రమానికి సంబంధించి ఓ ఈమెయిల్ పంపాడు. అయితే, ఆ భక్తుడికి ఆధ్యాత్మిక అంశాల లింకు పంపాల్సిందిపోయి, ఎంతో నిర్లక్ష్యంగా పోర్న్ లింక్ పంపారు. దాంతో ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి, ఈవోకి ఫిర్యాదు చేశారు.
 
ఈ వ్యవహారం రాష్ట్రంలో పెను కలకలం సృష్టించింది. అధికార పార్టీ వైకాపై విపక్షాలన్నీ ధ్వజమెత్తారు. సాక్షాత్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం.. సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సెలవిచ్చారు. 
 
దీంతో తితిదే అధికారులు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించడంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగం... ఈ లింకులు షేర్ చేయడంలో కారకులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ బృందాన్ని రంగంలోకి దించింది. 
 
ఈ నేపథ్యంలో, ఎస్వీబీసీ కార్యాలయానికి చెందిన ఐదుగురు ఉద్యోగులను టీటీడీ తొలగించింది. మరో నలుగురికి షోకాజ్ నోటీసులు పంపింది. పోర్న్ లింక్ పంపిన ఉద్యోగిని ఇప్పటికే తొలగించినట్టు తెలుస్తోంది.
 
ఈ ఐదుగురు కూడా ఎస్వీబీసీ కార్యాలయంలో విధులు నిర్వర్తించే సమయంలో పోర్న్ వీడియోలు చూస్తున్నట్టు సైబర్ క్రైమ్ బృందం గుర్తించింది. టీటీడీ వేటుకుగురైన వారిలో వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు ఉన్నారు. ఇక షోకాజ్ నోటీసులు అందుకున్నవారిలో చానెల్ మేనేజర్లు, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు.