గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (16:10 IST)

తప్పులు చేయడం.. సారీలు చెప్పడం.. మరో పనిలేదా : సునీల్ దేవధర్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులపై బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ మండిపడ్డారు. ఎస్వీబీసీ చానెల్‌లో పోర్న్ లింకులు ప్రసారం కావడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. తితిదే అధికారులు ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు చేయడం... ఆపై క్షమాపణలు చెప్పడం పరిపాటిగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ధన త్రయోదశి నాడు శ్రీవారిని దర్శించుకోవడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ఆయన, కరోనా మహమ్మారి త్వరగా పోవాలని, ప్రజలకు విముక్తి కలగాలని స్వామిని కోరుకున్నట్టు తెలిపారు.
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీటీడీతో పాటు ఎస్వీబీసీ చానెల్‌లో సైతం అసాంఘిక ఘటనలు జరుగుతున్నాయని, ఇక్కడ జరుగుతున్నది చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. దేశంలో ఉన్న అత్యుత్తమ ఆలయం తితిదే అని కితాబిచ్చారు. భక్తిపరంగానేకాదు.. పరిశుభ్రతలోనే ది బెస్ట్ టెంపుల్ తిరుమల శ్రీవారి ఆలయం అని చెప్పుకొచ్చారు. 
 
అయోధ్యలో జరిగిన రామాలయం భూమి పూజను సైతం టీటీడీ ప్రసారం చేయలేదని మండిపడ్డారు. ఆపై ఎస్వీబీసీ పెద్దలు క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇకపై టీటీడీలోనూ, ఎస్వీబీసీ చానెల్‌లోనూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం కూడా టీటీడీ ఆస్తులను, ఆభరణాలు, నిధులను కాపాడుతూ, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకోవాలని కోరారు.