1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 జులై 2023 (21:36 IST)

తెల్లదొరలే పారిపోయారు.. ఆఫ్ట్‌రాల్ ఈ జగన్ ఎంత? పవన్ కళ్యాణ్ వార్నింగ్

pawankalyan
దేశ స్వాతంత్ర్య పోరాటంలో గుండె ధైర్యంతో పోరాటం చేస్తే తెల్ల దొరలే పారిపోయారని, ఆఫ్ట్‌రాల్ ఈ జగన్ ఎంత అని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. పైగా, ఏపీ సీఎం జగన్ ఏమాత్రం శత్రువు కాదన్నారు. పైగా, అతనికి అంత సీన్ లేదని వ్యాఖ్యానించారు. ఆయన గురువారం తణుకు నియోజకవర్గంలో వీర మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ధైర్యంతో పోరాటం చేస్తే బ్రిటిష్ వారే పారిపోయారు.. ఇక జగన్ ఎంత? అన్నారు. ఇదే తనకు ధైర్యం అన్నారు. తన పోరాటం జగన్‌పై కాదని, ప్రజా సమస్యలపై అని స్పష్టం చేశారు. జగన్ గిచ్చాడని మోడీకి ఫిర్యాదు చేస్తే బాగుండదని, ఆయన సంగతి తాము ఇక్కడే తేల్చుకుంటామన్నారు. జగ్గూభాయ్, జగ్గూ గ్యాంగ‌ను ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసునన్నారు.
 
జగన్‌ను జగ్గూభాయ్ అంటారని, ఇప్పుడు ఇక్కడ జగ్గూభాయ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. తన పోరాటం జగన్‌పై కాదని, ప్రజాస్వామ్యాన్ని పట్టిపీడిస్తున్న జలగలపై అన్నారు. అసలు జగన్ అనేవాడు నాకు ఆనడు అన్నారు. ఈ జగన్ పోతే రేపు మరో జగన్ వస్తాడని, అందుకే తమ పోరాటం సమస్యలపై అన్నారు. 
 
జగన్ ఒక రౌడీ పిల్లాడని చురకలు అంటించారు. యువతలో ప్రతిభను వెలికితీయకుండా రూ.100కు పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎంతకాలం పేదవారిని పట్టి పీడిస్తారని నిలదీశారు. తన కుటుంబం జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరమే లేదన్నారు. 
 
డిగ్రీ చదివిన యువకులను అక్షరాలా కేవలం రూ.165కు పని చేయిస్తున్నారన్నారు. ఒక యువకుడి ఖరీదు ఇంతేనా? అన్నారు. దీన్నే తాను ఎత్తి చూపానని గుర్తు చేశారు. తాను అయితే ఇదే వాలంటీర్ వ్యవస్థలో ఉన్న యువకుల సామర్థ్యాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తానని, వారిని ఆ రంగాల్లో నిష్ణాతులను చేస్తానని చెప్పారు. కులాలపరంగా ఇలా ప్రతిభను వెలికి తీయవద్దని, సమర్థత, వారిలోని ప్రతిభ పరంగా చూడాలన్నారు.