1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (20:55 IST)

వాట్సాప్ నంబరుకు ఫోటో పంపండి.. రూ.10 వేలు నగదు పొందండి... అచ్చెన్న

వైకాపా ప్రభుత్వం నియమించిన వలంటీర్ల అరాచకాలను ఫోనులో రికార్డు చేసిగానీ, ఫోటోలు తీసిగాని తమకు పంపితే రూ.10 వేల నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేస్తామని తెదేపా ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇందుకోసం 755 755 77 44 అనే నంబరుకు పంపించాలని కోరారు. 
 
తిరుపతి లోక్‌సభకు త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో పథకాలు రావంటూ బెదిరింపులకు పాల్పడుతున్న అధికార వైసీపీ ఎత్తులను చిత్తు చేసేందుకు వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. వలంటీర్లు గానీ, అధికార పార్టీకి చెందిన వారు గానీ బెదిరిస్తే... వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. 
 
తిరుపతిలో సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీకి ఓటెయ్యకపోతే పథకాలు రావంటూ భయపెట్టే వలంటీర్ల గుట్టురట్టు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాంటి వారి సమచారాన్ని పార్టీకి అందించాలని ఓ వాట్సాప్ నంబర్‌ను ప్రకటించారు. 
 
755 755 77 44 అనే నంబర్‌కు కాల్ రికార్డు కానీ, ఫొటో కానీ వాట్సాప్ చేస్తే సంబంధిత వ్యక్తుల అకౌంట్‌లో రూ.10వేలు వేస్తామని చెప్పారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఇది వర్తిస్తుందన్నారు. ఈ విషయాన్ని అందరికీ చేరేలా చేయాలని కోరారు. 
 
రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. తిరుపతిలోనే టీడీపీకి ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయని ఆయన అన్నారు. అయితే అధికార పార్టీ బెదిరింపులతో ఓటమి తప్పలేదన్నారు. పథకాలు పోతాయనే భయం అవసరం లేదని... ఆ డబ్బులు జగన్ రెడ్డి తాత డబ్బులో.. తండ్రి డబ్బులో కాదని.. అవి ప్రజల డబ్బులని అచ్చెన్నాయుడు అన్నారు.