1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 26 జూన్ 2024 (09:11 IST)

నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక : విప్ జారీ చేసిన టీడీపీ!!

tdplogo
లోక్‌సభ సభాపతి ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా మరోమారు పోటీ చేస్తున్నారు. అలాగే, ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ సురేష్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరోవైపు, స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలందరూ సభకు తప్పనిసరిగా హాజరై తమ మద్దతు తెలియజేయాల్సివుంది. 
 
ఈ పరిస్థితుల్లో తన 16 మంది ఎంపీలకు టీడీపీ మూడు వాక్యాలతో కూడిన విప్ జారీచేసింది. టీడీపీ ఎంపీలందరూ రేపు లోక్‌సభకు తప్పనిసరిగా హాజరుకావాలని టీడీపీ చీఫ్ విప్ జీఎం హరీశ్ బాలయోగి విప్ జారీచేశారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఉండటంతో పాటు ఎన్డీయే స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. 
 
లోక్‌సభ ఎన్నిక నేపథ్యంలో బుధవారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీలో టీడీపీ లోక్‌సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్షతన టీడీపీ ఎంపీలు సమావేశంకానున్నారు. స్పీకర్ ఎన్నికలో ఓటింగ్ విధానంపై ఎంపీలకు ఈ సమావేశంలో అవగాహన కల్పించనున్నారు. ఈ సమావేశం తర్వాత టీడీపీ ఎంపీలంతా కలిసి పార్లమెంట్ భవనానికి వెళతారు.
 
ఆ మార్గంలో 78 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే!! 
 
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరోమారు అనేక రైళ్ళు రద్దు అయ్యాయి. కాజీపేట - బల్లార్ష సెక్షన్‌లో ఇంజనీరింగ్ పనుల మరమ్మతుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ మార్గంలో ఏకంగా 78 రైళ్ళను రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్గంలో ఇంజనీరింగ్ పనులతో పాటు ఆసిఫాబాద్ - రేచ్ని స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణం కారణంగా వివిధ రోజుల్లో మొత్తం 78 రైళ్ళను రద్దు చేశారు. 26 ఎక్స్‌‍ప్రెస్‌లను దారి మళ్లించారు. వాటి వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లు కనిష్టంగా ఒక్క రోజు గరిష్టంగా 11 రోజుల పాటు రద్దు కానున్నాయి. 
 
సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ల మధ్య తిరిగే కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (నం.12757/12758) జూన్‌ 26 నుంచి జులై 6 వరకు రద్దయ్యాయి. పుణె - కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ (నం.22151) ఈ నెల 28, జులై 5న.. కాజీపేట - పుణె ఎక్స్‌ప్రెస్‌ (నం.22152) జూన్‌ 30, జులై 7న.. హైదరాబాద్‌ - గోరఖ్‌పూర్‌ (నం.02575) జూన్‌ 28న, గోరఖ్‌పూర్‌ - హైదరాబాద్‌ (నం.02576) ఎక్స్‌ప్రెస్‌ జులై 30న రద్దయ్యాయి.
 
అలాగే, ముజఫర్‌పూర్‌ - సికింద్రాబాద్‌ (నం.05293) జులై 2న, సికింద్రాబాద్‌ - ముజఫర్‌పూర్‌ (నం.05294) జూన్‌ 27, జులై 4న.. గోరఖ్‌పూర్‌ - జడ్చర్ల (నం.05303) రైలు జూన్‌ 29న, జడ్చర్ల - గోరఖ్‌పూర్‌ (నం.05304) రైళ్లు జులై 1న రద్దయ్యాయి.   
 
సికింద్రాబాద్‌ - రాక్సల్‌ మధ్య తిరిగే వేర్వేరు మూడు రైళ్లు జూన్‌ 26, 27, 28 తేదీల్లో.. సికింద్రాబాద్‌ - దానాపుర్‌ల మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు జూన్‌ 27, 28, 29, జులై 1 తేదీల్లో.. సికింద్రాబాద్‌ - సుభేదార్‌గంజ్‌ మధ్య తిరిగే రైళ్లు జూన్‌ 27, 29 తేదీల్లో రద్దయ్యాయి.
 
అదేవిధంగా తెలంగాణ, దురంతో ఎక్స్‌ప్రెస్‌లను నిర్ణీత తేదీల్లో దారి మళ్లించి నడిపించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్‌ - న్యూఢిల్లీ (నం.12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్‌ మీదుగా మళ్లించనున్నారు. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను ప్రయాణమార్గం నుంచి తొలగించారు. 
 
న్యూఢిల్లీ - సికింద్రాబాద్‌ (నం.12724) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 3, 4, 5 తేదీల్లో ముద్కేడ్, నిజామాబాద్‌ మీదుగా నడిపిస్తారు. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్లను ప్రయాణమార్గం నుంచి తొలగించారు. సికింద్రాబాద్‌ - నిజాముద్దీన్‌ (ఢిల్లీ), నిజాముద్దీన్‌ - సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను (నం.12285/12286) జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్‌ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు.