శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (08:34 IST)

ఊర కుక్కల్లా టీడీపీ నేతలు..: వైసీపీ

టీడీపీ నేతలు ఊర కుక్కల్లా మొరుగుతున్నారని.. దమ్ముంటే స్టేలు ఎత్తివేసి మాట్లాడాలని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

టీడీపీ నేతలపై వైసీపీ ఆయన దారుణ వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఐటీ సోదాల ప్రస్తావన తెచ్చారు.

ఐటీ సోదాల్లో 2 వేల కోట్లు బయటపడ్డా టీడీపీ నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. ఇంతలా అవినీతి జరిగిందని బయట పడినా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
 
కన్నబాబు తీవ్ర విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలనే ప్రజా చైతన్య యాత్ర పేరుతో డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు బస్సుయాత్ర కాదు.. కాశీ యాత్ర చేయాల్సిందే అని వ్యాఖ్యానించారు. ‘‘ఐదేళ్ల టీడీపీ పాలనలో అమరావతిని పూర్తి చేయలేదు. ఒక్క పరిశ్రమని కూడా తీసుకురాలేదు.

ఒక పెద్ద విద్యాసంస్థనూ తీసుకురాలేదు’’ అని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే చంద్రబాబుకు ఎందుకు అంత ఉలికిపాటు అని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు.

ఆయన ఏ యాత్ర చేసినా ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ హయాంలో వడ్డీ రాయితీ చెల్లించలేదని ఆరోపించారు. సహకార బ్యాంకులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.

ఇప్పుడు డీసీబీలు, సహకార బ్యాంకులను బలోపేతం చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. బస్సు యాత్ర పేరుతో డ్రామాలాడుతున్న టీడీపీ నేతలు.. అసలు ప్రభుత్వం చేసిన తప్పులేంటో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు గ్రాఫిక్స్ వెనుక ఉన్న నిజాలను బయట పెట్టడం తప్పా అని ప్రశ్నించారు. ఐటీ సోదాల్లో చంద్రబాబు పీఏ, అనుచరుల అవినీతి లెక్కలు బయటపడ్డాయని అన్నారు. రూ.2వేల కోట్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు.

ఎనిమిది నెలల్లో ఎవ్వరూ ఊహించని విధంగా సీఎం జగన్ పరిపాలిస్తున్నారని, ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని మంత్రి కన్నబాబు చెప్పుకొచ్చారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కోసం అని రూ.2వేల కోట్లు తీసుకువచ్చి.. వాటిని పసుపు కుంకుమ పథకానికి దారిమళ్లించారని దుయ్యబట్టారు.