మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (11:37 IST)

ఎక్కడివారే అక్కడే... తెదేపా నేతల హౌస్ అరెస్టులు .. పోలీసుల ఉక్కుపాదం

విజయవాడ పరిధిలో ఉన్న తెలుగుదేశం నాయకులను, గురువారం పోలీసులు హౌస్ అరెస్ట్ చెయ్యటం కలకలం రేగింది. ప్రశాంతంగా సాగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి, ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులుగా సంఘీభావం తెలపటం కూడా, తప్పేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్యమం ప్రశాంతంగా సాగటం, ఈ ప్రభుత్వానికి ఇష్టం లేక, ఇలా అనవసర ఉద్రిక్త పరిస్థితులు రేగేలా చేస్తున్నారా అంటూ టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. 
 
అమరావతి ఆందోళనలో భాగంగా, గురువారం అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో, విజయవాడ ధర్నా చౌక్‌లో, ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఇతర నాయకులకు ఆహ్వానం వచ్చింది. 
 
అయితే గురువారం ఉదయం పోలీసులు, ముందస్తు బద్రతా చర్యల్లో భాగంగా, వీరిని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను హౌస్ అరెస్ట్ చేసారు. అయితే పోలీసులు మాత్రం, ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసనకు వెళ్తారనే ఉద్దేశంతో నిర్బంధించామని చెప్తున్నారు.
 
అయితే ధర్నా చౌక్ వద్ద, ప్రభుత్వం నిర్దేశించిన స్థలంలోనే, ఆందోళన చేస్తాం, అమరావతి రైతులకు సంఘీభావం తెలుపుతాం అని చెప్తున్నా, ప్రభుత్వం ఎందుకు ఇలా భయపడుతుంది అంటూ, టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 8 రోజులుగా చేస్తున్న ఈ ఉద్యమం, నేమ్మదిగా ప్రజల్లోకి వెళ్ళింది అని, అందుకే వైసీపీ నేతలు కనీసం ప్రెస్ మీట్ పెట్టటానికి కూడా భయపడుతున్నారని, వారికి ఎలాగూ ఈ రైతుల పట్ల నిలబడే దమ్ము లేదని, మేము వారికి సంఘీభావం తెలుపుతాం అని చెప్తున్నా, ఎందుకు ఇలా నిర్భందం చేస్తున్నారని, టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. తాము ఇప్పటి వరకు, ఎక్కడా శాంతిబాధ్రతలకు విఘాతం కలిగించలేదని, శాంతియుతంగా సాగుతున్న పోరాటాన్ని, ఇలాగే కొనసాగేలా చెయ్యాలని కోరుతున్నారు.
 
ఇక మరో పక్క, ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరితను కలిసేందుకు ప్రయత్నిం చేసిన, అమరావతి పరిరక్షణ సమితి నేతలకు షాక్ తగిలింది. అమరావతి పరిరక్షణ సమితి నేతలకు, హోం మంత్రి మేకతోటి అపాయింట్‌మెంట్ నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ, తమ పోరాటంలో కలిసి రావాలని, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇస్తున్నారు, అమరావతి పరరక్షణ సమితి నేతలు. ఇప్పటికే కొంత మంది వైసీపీ నేతలను కూడా కలిసి, ఇచ్చారు. అయితే, ఈ రోజు హోం మంత్రి మేకతోటి సుచరిత వద్దకు రాగా, ఆమె వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు సుచరిత నిరాకరించడంతో జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీరు సరికాదని మండిపడుతున్నారు.