ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (17:05 IST)

బాబుపై సీఎం జగన్ మైండ్ గేమ్ - తెదేపా ఎమ్మెల్యేకు గాలం

రాజధాని తరలింపు వ్యవహారంపై అమరావతి రైతులు రోడ్డెక్కారు. వీరికి తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన మైండ్‌గేమ్‌ను ప్లే చేశారు. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను తన వైపునకు తిప్పుకున్నారు. ఆ ఎమ్మెల్యే పేరు మద్దాలి గిరి. ఈయన వైకాపాలో చేరేందుకు సిద్ధమైపోయారు. ఇదే అంశంపై ఆయన సోమవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన్ను దగ్గరుండి సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. 
 
వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లితో అదే సామాజిక వర్గానికి చెందిన మద్దాలి గిరి గత కొంత కాలంగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఓవైపు రాజధాని రైతులు ఆందోళన చేస్తున్న తరుణంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. ఈయనతో పాటు మరికొందరు కీలక నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
మద్దాలి గిరిని తనవైపునకు రప్పించుకోవడం వల్ల జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు సమాచారం. రాజధాని రైతులు ఉధృతంగా ఆందోళన చేస్తున్న సమయంలో గుంటూరు పశ్చిమకు చెందిన తెదేపా ఎమ్మెల్యేను తనవైపునకు తిప్పుకోవడం వల్ల తెదేపా ప్రజాప్రతినిధులు కూడా తన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని ప్రజలకు చెప్పేందుకే జగన్ ఈ పని చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.