శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 16 నవంబరు 2021 (16:56 IST)

వివేకా హత్యలో నిందితులు ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డే అన్న ప‌ట్టాభి

వివేకానంద రెడ్డి హత్యలో అస‌లు దోషులు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్కర్ రెడ్డే అని టీడీపీ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభి రామ్ ఆరోపించారు. వారి వెనకుండి, వారిని కాపాడుతోంది  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అని అన్నారు. సీబీఐ కడపఎంపీ అవినాశ్ రెడ్డిని, ఆయన తండ్రి వై.ఎస్. భాస్కర్  రెడ్డిని, రాష్ట్రముఖ్యమంత్రిని కూడా విచారిస్తేనే, వివేకాహత్య కేసుకి ముగింపు వస్తుంద‌న్నారు.


హత్యానంతరం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై పలు అనుమానాలున్నాయన్నాయ‌ని  వివేకా కుమార్తె డాక్టర్ సునీత హైకోర్టులో వేసిన  పిటిషన్ లో ప్రస్తావించార‌ని చెప్పారు. సునీత తన పిటిషన్లో పేర్కొన్న అంశాలపై సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతార‌ని ప‌ట్టాభి ప్ర‌శ్నించారు. 
 
 
గత రెండున్నర సంవత్సరాల నుంచీ  హూ కిల్డ్ బాబాయ్ అన్నప్రశ్నకు ప్రజలు సమాధానం వెతుకుతూనే ఉన్నారని, ఆ ప్రశ్న రాష్ట్ర ప్రజలకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందన్నారు. కొద్ది రోజుల క్రితం షేక్ దస్తగిరి అనే వ్యక్తి, వివేకా హత్యకు సంబంధించి కీలకమైన అంశాలు వెల్లడిస్తూ, వాంగ్మూలం ఇచ్చాడని, అతను చెప్పిన అంశాలతోపాటు, వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్న పలు అంశాలు, హత్య వెనకున్న కీలక వ్యక్తుల పాత్రను, ప్రమేయాన్ని బహిర్గతం చేస్తున్నాయని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

 
 
ఎర్ర గంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, యాదాటి సునీల్ యాదవ్, దస్తగిరిలు హత్యలో పాల్గొన్నారని, వారందరినీ గంగిరెడ్డే లీడ్ చేశాడని దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పాడ‌న్నారు. వివేకా హత్యలో భాగస్వాములు అయినందుకు, సహకరించినందుకు డీ.శంకర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.40కోట్లు వస్తాయని, అవి అందరం పంచుకోవచ్చని కూడా ఎర్రగంగిరెడ్డి, దస్తగిరితో చెప్పాడని కూడా వాంగ్మూలంలో ఉంద‌న్నారు. వివేకా హత్య తర్వాత ఏదైనా జరిగితే, తమను డీ.శంకర్ రెడ్డే కాపాడతాడని, అతనే వ్యవహారాలన్నీ చక్కబెడతాడని కూడా ఎర్రగంగిరెడ్డి తనతో చెప్పాడని దస్తగిరి తన వాంగ్మూలంలో పేర్కొన్నాడ‌న్నారు. 

 
 
వివేకా హత్య జరిగిన తర్వాత అందరూ గంగిరెడ్డి ఇంటికి వెళ్తే, అక్కడ కూడా శంకర్ రెడ్డే మనల్ని కాపాడతాడ‌ని, మిగిలిన పేమెంట్ కూడా అందిస్తాడని కూడా గంగిరెడ్డి మిగతా వారితో చెప్పాడని కూడా దస్తగిరి తనవాంగ్మూలంలో స్పష్టం చేశాడ‌ని చెప్పారు. వివేకాను హత్య చేసిన నలుగురు వ్యక్తుల వెనుక ఉండి హత్యను నడిపించింది డీ.శంకర్ రెడ్డి అనేవ్యక్తి. ఈ మొత్తం వ్యవహారమంతా డీ.శంకర్ రెడ్డే దగ్గరుండి నడిపించాడని కూడా దస్తగిరి వాంగ్మూలంతో స్పష్టమవుతోంది. హత్య తర్వాత దస్తగిరి, తనకు అంటిన రక్తపు మరకలు కడుక్కోవడానికి, శుభ్రపరుచుకోవడానికి దగ్గర్లోని రాజారెడ్డి ఆసుపత్రికి వెళ్లానని కూడా స్వయంగా చెప్పాడ‌న్నారు. 

 
 
ముఖ్యమంత్రి తాతగారి పేరుతో ఉన్న రాజారెడ్డి ఆసుపత్రి తప్ప, నిందితుడు దస్తగిరికి మరెక్కడికి వెళ్లాలని ఎందుకుఅనిపించ లేద‌ని ప్ర‌శ్నించారు. అక్కడికి వెళితే తాను సురక్షితంగా ఉంటానని, ప్రశ్నించేవారుండరన్న ధీమాతోనే దస్తగిరి అక్కడికివెళ్లి, రక్తపుమరకలు కనుక్కున్నాడా?  ఆసుపత్రి మనదైనప్పుడు, ఆధారాలు రూపుమాపడం పెద్దసమస్య కాదుకదా అన్నదైర్యంతోనే దస్తగిరి అలా ప్రవర్తించినట్టు అతని వాంగ్మూలాన్నిబట్టి స్పష్టమవుతోంద‌ని ప‌ట్టాభి చెప్పారు.