బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (14:40 IST)

బతికుండి సుఖపెట్టలేదు.. నీవు చచ్చిపో... నేను ప్రియుడితో ఉంటా...

కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి మానసికంగా వేధించింది. బతికుండి సుఖపెట్టలేకపోయావు. నీవు చచ్చిపో.. నేను నా ప్రియుడితో సుఖంగా ఉంటా అంటూ పదేపదే వేధించడంతో ఆ భర్త మనసు విరక్తి చెంది వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని మల్యాలా మండలం నూకపల్లిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కరీంనగర్ జిల్లా మల్యాలకు చెందిన అట్టపల్లి రాజు(30)కు గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన రమ్యతో యేడాది కిందట వివాహమైంది. తర్వాత రమ్యకు తుంగూరుకు చెందిన రాజేందర్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు రాజుకు తెలిసింది. ఈ క్రమంలో రాజేందర్‌తో ఆమె చనువుగా ఉండటం చూసిన రాజు పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. 
 
కొద్దిరోజుల కిందట రమ్య గర్భం దాల్చింది. తన ప్రియుడి వల్లే తాను గర్భం దాల్చానని చెప్పి, తల్లిగారింటికి వెళ్లి అబార్షన్‌ చేయించుకుంది. పైగా, బతికుండి కూడా సుఖపెట్టలేకపోయావు. నా ప్రియుడి కారణంగా గర్భందాల్చాను. నువ్వు బతికి ఉండటం వృథా, చచ్చిపో అంటూ రమ్యతోపాటు రాజేందర్‌ ఫోన్‌లో తరచూ రాజును మానసికంగా వేధించారు. 
 
దీంతో మనస్తాపం చెందిన అతను మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి, నూకపల్లి శివారులోని వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు వరద కాలువ వద్ద వెతకగా బైక్‌తోపాటు రాజు చెప్పులు కనిపించాయి. కాలువలో గాలించడంతో మృతదేహం లభ్యమైంది. తన కుమారుడి మృతికి కోడలు, ఆమె ప్రియుడే కారణమని మృతుడి తండ్రి నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.