శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 నవంబరు 2019 (13:05 IST)

అవసరానికి డబ్బులు ఇవ్వలేదనీ అమ్మను చంపేశారు...

అవసరానికి డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో ఇద్దరు కుమార్తెలు కలిసి అమ్మను చంపేశారు. ఈ దారుణం నల్గొండ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా అప్పాజీపేటకు చెందిన కల్లూరి సత్తెమ్మ (60)కి ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు కావడంతో వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. దీంతో ఒంటరిగా మిగిలిన సత్తెమ్మ పదేళ్లుగా అదే గ్రామానికి చెందిన కూరాల యాదయ్యతో కలిసి జీవిస్తోంది.
 
ఈ క్రమంలో సత్తెమ్మ చిన్న కుమార్తె రుద్రమ్మను తమతో పాటే ఉండమని చెప్పిన సత్తెమ్మ.. కూతుర్ని యాదయ్యకి ఇచ్చి పెళ్లి చేసింది. ఈ క్రమంలో వారికి ఓ పాప జన్మించింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో రుద్రమ్మ భర్త నుంచి దూరం జరిగి చౌటప్పల్‌కు వెళ్లిపోయింది. అక్కడ ఓ కిరాణా దుకాణం పెట్టుకుని జీవిస్తోంది.
 
ఇటీవల డబ్బులు అవసరమైన రుద్రమ్మ డబ్బులు కావాలని తల్లిని అడిగింది. తాను ఇవ్వనని, కొడుకులకు మాత్రమే ఇస్తానని చెప్పింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న రుద్రమ్మ.. చౌటుప్పల్ మండలంలోని రెడ్డిబాయిలో ఉంటున్న తన సోదరి మాదగోని ఆండాల్‌కు విషయం చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి తల్లి హత్యకు పథకం పన్నారు. ఇందుకోసం నెర్మటకు చెందిన గుయ్యాని జంగయ్యతో రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
 
గత నెల 31న రాత్రి రుద్రమ్మ.. జంగయ్యతో కలిసి బైక్‌పై తల్లి ఇంటికి చేరుకుంది. అనంతరం సత్తెమ్మను జంగయ్య గట్టిగా పట్టుకోగా రుద్రమ్మ తల్లి గొంతు నులిమి ప్రాణాలు తీసింది. అనంతరం ఇంట్లోని మూడు తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి వస్తువులు, రూ.30 వేల నగదు తీసుకుని పరారయ్యారు.
 
తల్లిని హత్య చేసినట్టు సోదరి ఆండాల్‌కు రుద్రమ్మ ఫోన్ చేసి చెప్పింది. సత్తెమ్మ కుమారుడు సైదులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానంతో రుద్రమ్మ ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.