1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (12:23 IST)

విదేశీ పర్యటనకు వెళ్లాలనివుంది.. అనుమతి ఇవ్వండి : కోర్టులో జగన్ పిటిషన్

jagan
తాను విదేశీ పర్యటనకు వెళ్లాల్సివుందని, అందువల్ల తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టును కోరారు. ఈ మేరకు ఆయన ఒక పిటిషన్‌ను దాఖలు చేయగా, దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు తీర్పును మాత్రం వాయిదా వేసింది. ఇక్కడ విషయమేమిటంటే.. సీఎం జగన్‌తో ఆయన వ్యక్తిగత ఆడిటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమితి ఇవ్వాలని కోరడం గమనార్హం. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి.
 
కాగా, సెప్టెంబర్ 2వ తేదీన లండన్‌లోని తన కూతురును చూసేందుకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని, ఇందుకు దేశం విడిచి వెళ్లరాదన్న తన బెయిల్ షరతులను సడలించాలని జగన్ తన పిటిషన్ కోరారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు విచారణను బుధవారం వాయిదా వేసింది. ఈ రోజు సీబీఐ వాదనలు వినిపించింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని కోర్టుకు విన్నవించింది. వాదనల అనంతరం విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని నేటికి వాయిదా వేసింది.
 
మరోవైపు యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, ఈ రోజు వాదనలు ముగిశాయి. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ... కోర్టును కోరింది. ఈ రోజు వాదనలు ముగియడంతో న్యాయస్థానం తన నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది.