1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (13:34 IST)

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం దొంగగా మారిన భర్త

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మార్టూరుకు చెందిన శ్రీను డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాకుళానికి చెందిన యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. మోసయ్యపేటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. భార్య గర్భవతి కావడంతో కొన్ని నెలల క్రితం ప్రసవం కోసం ఆమె పుట్టింటికి వెళ్లింది.

అయితే, భార్యకు చెప్పకుండా ఆమె బంగారాన్ని అతడు కుదువ పెట్టాడు. మరో వ్యక్తితో కలిసి వచ్చిన సొమ్ముతో ఆటో కొన్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో.. తన బంగారు నగలు తిరిగి తీసుకొస్తే తప్ప కాపురానికి రానని తేల్చి చెప్పింది.

భార్య కాపురానికి రానని చెప్పడంతో ఏం చేయాలో తెలియక.. డబ్బు సమకూర్చుకునే అవకాశం లేక‌పోవ‌డంతో.. తన ఆలోచన దొంగతనం వైపు మ‌ళ్లింది. అదే తడవుగా ఎదురుగా ఉన్న ఇంటిపై కన్ను పడింది. ఈనెల 12న ఆ ఇంట్లో నివాసం ఉండే కృష్ణవేణి.. దిబ్బపాలెం సెజ్‌ కాలనీలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది.

రాత్రికి ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో శ్రీను చోరీకి ప్లాన్‌ చేశాడు. ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి లోపలకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న ఆరు తులాల బంగారు నగలు, 15 తులాల వెండి వస్తువులు, రూ.50 వేల డబ్బు దోచుకెళ్లాడు.

భార్య బంగారం తాకట్టు పెట్టిన ఫైనాన్స్‌ సంస్థలోనే ఈ నగల్ని కూడా కుదువ పెట్టి.. తన భార్య నగలు తీసుకుని అత్తవారింటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కృష్ణవేణి ఇంట్లో దొంగతనం జరగిందని తెలుసుకున్న పోలీసులు ఎదురింట్లో ఉన్న శ్రీను గురించి ఆరా తీశారు.

అతడిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. చోరీ చేసిన నగలు, డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. కోర్టు జైలు శిక్ష విధించింది.