1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 మే 2021 (10:56 IST)

కరోనా వైద్యసేవల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ కీలక నిర్ణయం

కరోనా బాధితుల సేవా కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 4 ప్రధాన పట్టణాల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆక్సిజన్ కోసం కరోనా బాధితులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి  రాష్ట్రంలోని రేపల్లె, పాలకొల్లు, కుప్పం, టెక్కలి పట్టణాల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నెలకొల్పడానికి ఏర్పాట్లు చేశారు.

హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభిస్తారు. ఇప్పటికే ఇంటివద్ద హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల కోసం 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఎన్టీఆర్ ట్రస్ట్ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు కరోనా బాధితులకోసం విదేశీ వైద్యులతో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆన్ లైన్ సేవలకు అనూహ్య స్పందన లభిస్తోంది. 

విదేశాల్లో పేరెన్నిక గన్న ప్రముఖు వైద్యులు డాక్టర్ లోకేశ్వరరావు (అమెరికా), డాక్టర్ ఆలపాటి అనూహ్య (న్యూయార్క్) ఎం.డి పల్మనాలజిస్ట్,  డా. నిరంజన్ మోటూరి, ఎం.డి.ఎస్ (యునైటెడ్ కింగ్ డమ్), డా. లక్ష్మీ పోలిశెట్టి, ఎం.డి (బ్రిడ్జ్ పోర్ట్. సి.టి) ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, డా. పాండురంగ కోయ, (సెయింట్ లూయిస్) బేరియాట్రిక్ మెడిసిన్, డా. ధీరజ్ నందనూర్ (స్టాక్ టన్ సి.ఏ) ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, డా. వేణు ఎం. మాదిపట్ల (మాల్ ట్రీ, జి.ఏ) పెయిన్ మేనేజ్ మెంట్ స్పెషలిస్ట్, డా. సునీల్ కొల్లి (ఆస్టిన్ టి.ఎక్స్) ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, డా. సాతిరాజు ఉండవల్లి-(మిన్నెసొట) ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ లు ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో ఆన్ లైన్ ద్వారా వైద్యసలహాలను అందిస్తుండగా, అవసరమైన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ మందులను ఉచితంగా అందజేస్తోంది.

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన కాల్ సెంటర్ 24/7 పనిచేస్తోంది. సాయం కోసం ఏ సమయంలో ఎవరు తలుపుతట్టినా స్పందించేందుకు వీలుగా ఈ కాల్ సెంటర్ సేవలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.  మరోవైపు కరోనా రోగులకు ఏవిధమైన సాయం అవసరమైనా తామున్నామంటూ ఎన్టీఆర్ ట్రస్ట్, తెలుగుదేశం కార్యకర్తలు భరోసా ఇస్తున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన అత్యవసర వైద్య విభాగాన్ని (ఎస్ఓఎస్) ఏర్పాటుచేసి సేవలందిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ తీవ్రత, ఆసుపత్రుల్లో సదుపాయాల లేమిని దృష్టిలో ఉంచుకొని ఏ ఒక్క కరోనా బాధితుడు ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో వాట్సాప్ చాట్ ద్వారా ప్రఖ్యాత డాక్టర్లచే వైద్యసలహాలను అందించే కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది.

వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివధ జిల్లాలు, పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ద్వారా వేలాదిమందికి ఉచితంగా మందులు, భోజనం, నిత్యావసర వస్తువులు తదితర సహాయాలను అందిస్తున్నారు. సమాజమే దేవాలయం...ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ అధికారంతో సంబంధం లేకుండా  నిరంతరం ప్రజాసేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటుంది.

కరోనా విపత్తు విశ్వరూపం చూపుతున్న వేళ ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు ఎన్ టిఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఎవరూ ఆకలితో ఉండరాదన్న ఉద్దేశంతో, దివంగత నేత ఎన్టీఆర్ స్పూర్తితో తెలుగుదేశం శ్రేణులు అవసరమైన వారికి భోజనం అందించేందుకు విస్తృతంగా చర్యలు చేపట్టాయి.