శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (07:18 IST)

ప్రధాని వ్యాఖ్యలు జగన్ కేసులో అక్షర సత్యం: యనమల రామకృష్ణుడు

అవినీతి కేసుల విచారణలో జాప్యం భవిష్యత్ కుంభకోణాలకు పునాది అవుతుందన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి కేసులో అక్షర సత్యాలని టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి లో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు యధావిధిగా..
 
అవినీతి కేసుల విచారణలో జాప్యం భవిష్యత్ కుంభకోణాలకు పునాది అవుతుందన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి కేసులో అక్షర సత్యాలు. అవినీతి కేసుల దర్యాప్తులో జరిగే జాప్యం ఒక శృంఖలం లాగా భవిష్యత్ కుంభకోణాలకు పునాది రాయిగా ఎలా మారుతుందో ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి పాలనే ఉదాహరణ. 
 
ఇంత తక్కువ వ్యవధిలో రూ.43 వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ ఆప్తాబ్ ఆలం గారు గతంలో వ్యాఖ్యానించారు.  జగన్ లాంటి ఆర్థిక ఉగ్రవాది చర్యలు సమాజానికి ప్రమాదకరమన్న విషయం ప్రధాని వాఖ్యాల ద్వారా మరోసారి బహిర్గతమయింది.  సిబిఐ, ఈడి వంటి విచారణ సంస్థలను వేగవంతంగా పని చేసి ఆర్థిక నిందితులపై చర్యలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది.  

ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఆర్థిక నేరగాళ్ళను శిక్షించకపోతే మొత్తం సమాజం నష్టపోతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టీస్ సదాశివం గారు, జిస్టిస్ ఎం.వై. ఇక్బాల్ గారు స్పష్టం చేశారు. ఆర్థిక నేరస్తులైన ప్రజా ప్రతినిధులపై విచారణ ఏడాదిలోగా పూర్తి చేయాలని 2017లో జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది.

2020 ఫిబ్రవరి 14న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఈ అంశాన్ని సుప్రీం కోర్టు జస్టిస్ కు అప్పగించారు. ప్రస్తుతం ఈ అశానికి సంబంధించి కార్యాచరణ జరుగుతున్నది. ఈ కార్యచరణను మరలా జాప్యం చేయడానికి 16 కేసుల్లో  విచారణ ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి న్యాయ వ్యవస్థపై దాడి ప్రారంభించారు. హైదరాబాద్ లో సిబిఐ, ఈడీ కోర్టుల్లో జరుగుతున్న విచారణ జాప్యానికి కుతర్కాలు ప్రారంభించారు.  ఇటువంటి పరిస్థితులలో ప్రధాని వ్యాఖ్యలు కీలకం కానున్నాయి.

ఆర్థిక నేరాల వల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు మరీ ఎక్కువగా పెరుగుతాయి. తండ్రి హయాంలో జగన్ రెడ్డి రూ. 43 వేల కోట్లు అవినీతిపై సిబిఐ, ఈడి చార్జ్ షీట్లు వేసింది.

జగన్ సీఎం అయిన తరువాత లాండ్, శాండ్, వైన్, మైన్ లలో భారీగా అవినీతి జరిగింది. వేల కోట్ల అవినీతి చేసి పేదలకు నామమాత్రంగా ఇచ్చే పథకాలను అమలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

మద్యం కుంభకోణం : పాపులర్ బ్రాండ్ లను కాదని నాసిరకం బ్రాండ్ లు పెట్టి ఏడాదికి రూ.5 వేల కోట్లు అవినీతి జరుగుతున్నదని వార్తలు వస్తున్నవి. నాసిరకం బ్రాండ్లు త్రాగి కొందరు ప్రాణాలు కూడ కోల్పోయారు. 

ఇసుక : మూడు రెట్లు  పెంచడమే కాక వైసీపీ నేతలు శాండి మాఫియాగా మారి భారీ అవినీతికి పాల్పడుతున్నారు. దీంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా దెబ్బతిన్నది. 

ల్యాండ్ స్కామ్ : సెంటు పట్టా పేరుతో రూ.4 వేల కోట్లు అవినీతి జరిగింది. వైసీపీ నేతలు భూకొనుగోళ్ళలోనూ, లెవలింగ్ లోను విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారు. భూమి కొనుగోళ్ళలో మరియు కొన్న భూమికి మెరక పేరుతో కోట్ల రుపాయలు అవినీతి జరిగింది. 

మైన్ స్కాం : జగన్ రెడ్డి కుటుంబ పరిశ్రమలలో డైరెక్టర్లుగా ఉన్న వారికి సరస్వతి పవర్ కు పలనాడులో 1600 ఎకరాల గనులు, నీరు కేటాయించడం అధికార దుర్వినియోగం మరియు నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. ఇలాగే రాష్ట్రంలో గ్రానైట్, గ్రావెల్  కుంభకోణాలు ఎన్నో జరుగుతున్నవి. 

అంబులెన్సుల స్కాం : విజయసాయిరెడ్డి వియ్యంకుడు సంస్థ అరవిందోకు అంబులెన్స్ లను అధిక రేట్లకు కట్టబెట్టడం ద్వారా రూ.307 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. చివరకు కోవిద్ కిట్స్ కొనుగోలు, బ్లీచింగ్ పౌడర్ లో కూడా కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు జరిగాయి. 

వీటిపై కూడ కేంద్రం విచారణ చేసి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అవినీతి బారి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలంటే ఆర్థిక నేరస్తులైన ప్రజా ప్రతినిధుల విచారణ జాప్యం జరగరాదన్నది ఆకాంక్షగా కూడ ఉన్నది. 

ఆర్థిక నేరగాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గుతాయి.