1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 23 ఆగస్టు 2021 (18:32 IST)

భక్తులు త్వరపడండి, తిరుమల శ్రీవారి దర్సన టోకెన్లు రేపు ఉదయం 9 గంటలకు విడుదల

తిరుమల శ్రీవారి దర్సనం చాలామంది భక్తులకు ప్రియంగా మారిపోయింది. అసలు ఆన్లైన్లో టిక్కెట్లు పొందగలమా అన్న అనుమానం చాలామందిలో నెలకొంది. ఆఫ్‌లైన్లో టోకెన్లు లేకపోవడంతో భక్తులు చాలామంది నిరాశకు గురవుతున్నారు.
 
నేరుగా తిరుపతికి వచ్చి రైల్వేస్టేషన్, బస్టాండ్, శ్రీనివాసం, మాధవం, భూదేవి కాంప్లెక్స్ వసతి సముదాయాల్లో టోకెన్లను తీసుకుని సులువుగా స్వామివారిని దర్సించుకుని వెళ్ళేవారు సామాన్య భక్తులు. శని, ఆదివారాలు మాత్రమే కాస్త ఇబ్బంది పడేవారు.
 
అయితే కరోనా కారణంగా ఆఫ్ లైన్ టోకెన్లను తీసేశారు. కౌంటర్లలో ఎక్కడా టోకెన్లను ఇవ్వకపోగా ఆన్ లైన్ లోనే టోకెన్లను ఇస్తున్నారు. ఏమాత్రం టోకెన్లను పెంచకుండా ప్రస్తుతానికి టిటిడి జాగ్రత్త వహిస్తోంది. తిరుమలకు వచ్చిన భక్తుల వల్ల కరోనా సోకకుండా ఉండాలన్నదే వారి ఆలోచన.
 
అయితే కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఇక టోకెన్లను పెంచుతారు. అందులోను సెప్టెంబర్ నెల టోకెన్లను అమాంతం పెంచే అవకాశం ఉందని భక్తులు భావించారు. మొదట్లో టిటిడి టోకెన్లను విడుదల చేస్తుందని ప్రకటన కూడా ఇచ్చింది. కానీ ఆ తరువాత ఆలస్యమవుతున్నట్లు చెప్పింది.
 
దీంతో భక్తులందరూ ఆఫ్ లైన్లో టోకెన్లను ఇస్తారేమోనని భావించారు. కానీ టిటిడి మళ్ళీ మరో ప్రకటనను విడుదల చేసింది. ఆన్ లైన్ లోనే భక్తులకు రేపు దర్సన టోకెన్లను ఇవ్వడానికి సిద్థమైంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన టోకెన్లను ఒకేసారి రేపు విడుదల చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది.
 
నెలరోజుల్లో ఏరోజు భక్తులు దర్సనానికి వెళ్ళాలనుకున్నా ఆ రోజుకు సంబంధించిన టోకెన్లను భక్తులు పొందాల్సి ఉంటుంది. ఆన్ లైన్లో ఒక్కసారి విడుదలైనా పెద్ద ఎత్తున భక్తులు ఆ టోకెన్లను పొందుతున్నారు. రేపు విడుదల చేసే టోకెన్లు ఎంతసేపట్లో అయిపోతుందోనన్న ఆందోళన కొంతమంది భక్తుల్లో నెలకొంది.
 
అయితే భక్తులు రేపు ఉదయం 9 గంటలకే సిద్థంగా ఉంటే వెంటనే టోకెన్లను పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మెల్లగా తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి శ్రీవారి భక్తులు త్వరపడండి.. టోకెన్ల కోసం సిద్థంగా ఉండండి.