శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

అమిత్ షా వద్దకు ఆర్టీసీ పంచాయతీ : కేసీఆర్‌కు చిక్కులు తప్పవా?

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె పంచాయతీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్దకు చేరనుంది. అమిత్ షాను కలిసి తమ సమస్యలు వివరించడానికి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ సిద్ధమైంది. 
 
తెలంగాణలో ఆర్టీసీ పరిస్థితులు, కొంత కాలంగా కార్మికుల కొనసాగిస్తోన్న సమ్మెను వివరించి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయనను కార్మికులు కోరనున్నారు.
 
ఈ నెల 5వ తేదీలోపు విధుల్లో చేరాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు డెడ్‌లైన్ విధించింది. దీంతో ఆదివారం ఉదయం జేఏసీ నేతలు... రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు టీజేఎస్, సీపీఐ, టీడీపీ నేతలను కలిశారు. 
 
తాము చేస్తోన్న సమ్మెను జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ పరిస్థితిని అమిత్ షాకు వివరిస్తామని, ఇందులో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరతామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. 
 
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఎస్‌ ఆర్టీసీ కార్మికులకు విధుల్లో చేరేందుకు విధించిన డెడ్‌లైన్‌కు ఓ ఉద్యోగి స్పందించాడు. ఉప్పల్‌ డిపోలో అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న కేశవ కృష్ణ (ఈ.నం. 201805) తాను తిరిగి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. 
 
ఈ మేరకు ఆయన డిపో మేనేజర్‌ను ఆదివారం కలిసి తన సమ్మతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తాను బేషరతుగా విధుల్లో చేరుతున్నట్లు కృష్ణ ప్రకటించారు.
 
కేసీఆర్‌ ప్రకటన నేపథ్యంలో కార్మికుల్లో అలజడి రేగే ప్రమాదం ఉందని భావించిన కార్మిక జేఏసీ దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించేందుకు ఆదివారం అత్యవసరంగా సమావేశమై చర్చించారు. అనంతరం కార్మిక నాయకుడు అశ్వత్థామరెడ్డి సమ్మె కొనసాగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.