శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (09:23 IST)

శ్రీవారి భక్తులకు షాకిచ్చిన తితిదే - వాహనాలకు అనుమతి లేదట...

tirumala
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తేరుకోలేని షాకిచ్చింది. తిరుమల కొండపైకి వచ్చే వాహనాల సంఖ్య 12 వేలు దాటిని తర్వాత ఒక్క వాహనాన్ని కూడా కొండపైకి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని భక్తులు గుర్తుపెట్టుకుని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని తితిదే అధికారులు కోరారు. 
 
ఈ నెల 27వ తేదీ నుంచి తితిదే బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. వీటిలో భాగంగా, అక్టోబరు ఒకటో తేదీన శ్రీవారికి గరుడ సేవ జరుగుతుంది. దీంతో ఈ నెల 30వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు తిరుమల కొండపైకి వాహనాలను నిలిపివేయనుంది. 
 
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా తిరుమల బ్రహ్మోత్సవాలు ఏకంతంగానే నిర్వహించారు. ఇపుడు పరిస్థితులన్నీ చక్కబడటంతో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు మళ్లీ బ్రహ్మాండంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తుంది. 
 
అదేసమయంలో ఈ బ్రహ్మోత్సవాలకు కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండటంతో తితిదే అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు వేల మంది పోలీసులతు భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. తిరుమలకు వెళ్లే వాహనాల సంఖ్య 12 వేలు దాటిన తర్వాత ఆపై ఒక్క వాహనాన్ని కూడా అనుమతించడం కుదరదని తేల్చి చెప్పింది. వాహనాలను తిరుపతిలోని పార్కింగ్ ప్రాంతాల్లో వదిలేస అక్కడ నుంచి భక్తులు ఆర్టీసీ బస్సుల్లో తిరుమల కొండపైకి చేరుకోవాలని సలహా ఇచ్చింది. 
 
వాస్తవానికి నిజానికి గరుడ సేవ నిర్వహించే రోజున ఉదయం నుంచి మరుసటి రోజు వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించరు. అక్టోబరు 1న గరుడ సేవ నిర్వహించనుండడంతో ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతించబోమని అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని టీటీడీ కోరింది.