మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (12:14 IST)

టాటాఏస్‌ ఆటో బీభత్సం.. మైనర్ బాలుడు నడిపాడు.. అంతే జనాల్లోకి దూసుకొచ్చి?

వారాసిగూడలో చౌరస్తాలో టాటాఏస్‌ ఆటో బీభత్సం సృష్టించింది. ఏకంగా జనాల్లోకి దూసుకెళ్లింది. పొరపాటున ఓ బాలుడు వాహనం నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు గుర్తించారు.


ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. గురువారం వారాసిగూడ చౌరస్తాలో ఉర్సు ఊరేగింపు కార్యక్రమం జరుగుతోంది. ఈ ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఓ టాటాఏస్‌ వాహనాన్ని ఓ పక్కన పెట్టి డ్రైవర్‌ ఊరేగింపులో పాల్గొంటున్నాడు. దీంతో అక్కడే ఉన్న ఓ మైనర్ బాలుడు వాహనం నడపాలని బండి రేజ్‌ చేయడంతో ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి జనాల మీదకు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ రాని బాలుడు వేగంగా వాహానాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. 
 
ఈ ప్రమాదంలో కొమరయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరో బాలుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డాడు. మరో 10 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.