1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (21:49 IST)

వేద పరిరక్షణ కర్తవ్యం కావాలి: బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్

ఆధునిక పరిశోధకుల ఊహలకు సైతం అంతుచిక్కని విద్య, వైజ్ఞానిక, సామాజిక, ఆర్థిక విషయాలెన్నో వేదాల్లో ఉన్నాయని, అటువంటి అమూల్య గ్రంథాలు మనకు వారసత్వ సంపదగా లభించాయని శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్పేర్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణువర్థన్ అన్నారు.

కృష్ణా మండల వేదం విద్వత్ ప్రవర్థక సభ ఆధ్వర్యాన విజయవాడ, లబ్బీపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న 72వ వార్షిక మహోత్సవాలు సుసంపన్నంగా ముగిశాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న విష్ణు మాట్లాడుతూ వేద పరిరక్షణ ప్రతి భారతీయుడి కర్తవ్యం కావాలన్నారు. ఇదొక మహోద్యమంగా సాగాలన్నారు. వేదాల్లో ఉన్న గొప్పదనాన్ని విదేశీయులు కీర్తిస్తుంటే మనం మాత్రం వేదాల పట్ల నిర్లక్ష్యం వహించటం శోచనీయమన్నారు.

ఇప్పటి అధునాతన కాలంలోనూ వేదం కోసం తమ బిడ్డల్ని అంకితం చేస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. దేవస్థానం ఛైర్మన్ మాగంటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వేద విద్యార్థుల పరీక్షలు నిర్వహించి, వారికి పట్టాలు మంజూరు చేసే ప్రామాణిక సంస్థగా ఈ సభకు జాతీయస్థాయి గుర్తింపు ఉందన్నారు. ముఖ్య పరీక్షాధికారి ‘స్వాధ్యాయరత్న’ విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి పరీక్షల నివేదిక సమర్పించారు.

జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 50 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కంభంపాటి అచ్యుతశర్మ, మంగిపూడి వేంకటశాస్త్రి ఘన పట్టాలు అందుకోగా, కపిలవాయి రైవతశర్మ క్రమాంతస్వాధ్యాయ పట్టా అందుకున్నారు. మరో 10 మంది విద్యార్థులు ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. వీరందరికీ అతిథులు ప్రశంసాపత్రాలు బహూకరించారు.