1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , మంగళవారం, 12 అక్టోబరు 2021 (16:53 IST)

సాంకేతిక పరిజ్ఞానంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించాలి

“రోడ్డు భద్రతా – ప్రమాదాల నియంత్రణ” అంశంపై రాష్ట్ర  పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి నిర్వ‌హించిన‌ వీడియో కాన్ఫరెన్స్ కు ఏలూరు రేంజ్ డీఐజీ కె వి మోహన్ రావు హాజ‌ర‌య్యారు. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి అడిషనల్ డి.జి.పి రవిశంకర్ అయ్యనార్, రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అదనపు.డీజీపీ కృపానంద్ త్రిపాఠిల నేతృత్వంలో జరిగిన  రోడ్డు భద్రత, ప్ర‌మాదాల నియంత్రణ స‌మావేశంలో ఉన్న‌తాధికారులు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఆంద్ర‌ప్ర‌దేశ్ లో రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించాల‌ని, క‌నీసం మృతుల సంఖ్య‌ను త‌గ్గించాల‌ని చెప్పారు. 
 
ఈ సమీక్షా సమావేశంలో స్టేట్ హైవే, నేషనల్ హైవే, ఇతర గుర్తించబడిన బ్లాకు స్పాట్ లలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల‌పై చ‌ర్చించారు. రోడ్ సేఫ్టీ పరికరాల సేకరణ వాటి ఉపయోగం, రోడ్డు భద్రతకు సంబందించి అన్ని శాఖల సమన్వయంతో ప‌నిచేయాల‌ని ఉన్న‌తాధికారులు సూచించారు.

రోడ్డుల‌పై సైనేజ్ బోర్డులు, లైటింగ్ సిస్టం, పెయింటింగ్ వర్క్స్, ట్రాఫిక్ కోన్స్ వంటివి ఏర్పాటు చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను గుర్తించి, వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. రోడ్డు ఇంజనీరింగ్ సంబంధిత అంశాలపై ఈ సమీక్ష‌ సమావేశంలో చర్చించి అన్ని రేంజ్  డి. ఐ.జి లు,  జిల్లా ఎస్పీల నుండి సూచనలు, సలహాలు కోరారు. ఈ సమావేశంలో ఐ.జి. నాగేంద్ర కుమార్, పోలీసు ప్రధాన కార్యాలయంలోని రోడ్డు భద్రతకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.