మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (13:43 IST)

జగన్ సారూ... మీరొచ్చి మా పొట్ట కొట్టారు.. సూసైడ్ చేసుకుంటా : దివ్యాంగుడు

ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఓ దివ్యాంగుడు పంపించిన వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. విశాఖపట్టణం పోలీసులను ఆందోళనకు గురిచేసింది. అతని స్నేహితులు గాబరా చెందారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. 
 
విశాఖపట్టణం జిల్లా వాంబే కాలనీలో శ్రీహరి అనే దివ్యాంగుడికి గత ప్రభుత్వం మీ సేవా కేంద్రాన్ని మంజూరు చేసింది. రెండు మూడు సంవత్సరాలుగా దీన్ని నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల హామీల్లో భాగంగా గ్రామ  లేదా వార్డు సచివాలయాన్ని మంజూరు చేశారు. 
 
వీటిద్వారా అన్ని సేవలను అందిస్తామని ప్రకటించారు. దీంతో మీ సేవా కేంద్రాలాలను నిర్వహిస్తూ వచ్చిన నిర్వాహకులు ఆందోళన చెందారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇలా గత ఆర్నెల్లుగా వారు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందనలేదు. 
 
ఈ క్రమంలో శ్రీహరి, ఓ వాయిస్ మెసేజ్‌ని తన మిత్రులకు పంపించాడు. ఆరు నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ప్రభుత్వం వెంటనే భరోసా ఇవ్వాలని, లేకుంటే, తన మీ సేవా కేంద్రంలోనే సూసైడ్ చేసుకుంటానని చెప్పాడు. ఈ మెసేజ్‌ని విన్న శ్రీహరి స్నేహితులు పరుగు పరుగున వాంబే కాలనీకి వచ్చి, మీ సేవా సెంటరులోనే తలుపేసుకుని ఉన్న అతన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.