శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (11:51 IST)

స్పీకర్ ఫార్మెట్‌లో గంటా రాజీనామా లేఖ : స్పీకర్‌కు ఇచ్చిన పాత్రికేయ సంఘం

విశాఖపట్టణం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్‌లో రాసిన ఈ లేఖను సోమవారం శాసనసభ కార్యదర్శికి లేఖను పంపారు. అలాగే, విశాఖ జర్నలిస్ట్స్ ఫోరం (వీజేఎఫ్) ప్రతినిధులు ఆ లేఖను శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యలుకు అందజేశారు. 
 
దీంతో పాటు గంటా రాసిన మరో లేఖను కూడా ఆయనకు అందజేశారు. తాను స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేశానని, ఇంకేమైనా సమాచారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నానని గంటా ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, వీజేఎఫ్ ప్రతినిధుల నుంచి గంటా రాజీనామా లేఖను తీసుకోవడానికి ముందు నాలుగు గంటలపాటు హైడ్రామా నడించింది.
 
రాజీనామా లేఖను ఇవ్వాల్సింది తమకు కాదంటే, తమకు కాదంటూ శాసనసభ సిబ్బంది వీజేఎఫ్ ప్రతినిధులను నాలుగు గంటలపాటు తిప్పించుకున్నారు. దీంతో గంటా జోక్యం చేసుకుని బాలకృష్ణమాచార్యులుతో ఫోన్‌లో మాట్లాడడంతో నాలుగు గంటల తర్వాత లేఖను తీసుకున్నారు. 
 
కాగా, రాజీనామా చేస్తున్నట్టు గంటా ప్రకటించిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. రాజీనామా నిర్ణయంపై గంటాను ప్రశ్నించగా, తాను అందుకే కట్టుబడి ఉన్నట్టు గంటా స్పష్టం చేసినట్టు తెలిసింది.