శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (16:30 IST)

స్పీకర్ ఫార్మెట్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తెదేపా ఎమ్మెల్యే గంటా

విశాఖపట్టణం ఉత్తర అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజీనామా చేశానని చెప్పారు. 
 
ఇప్పటికే తాను రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ ఫార్మాట్‌లో చేయలేదన్న విమర్శలు వచ్చాయని, అందుకే అన్ని ఫార్మాట్‌లలో రాజీనామా లేఖ ఇస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు వివరించారు. కార్మిక సంఘాలకు అండగా నిలుస్తానని ఆయన స్పష్టం చేశారు. 
 
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేపింది. కేంద్రం నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీల నేతలు ముక్తకంఠంతో తప్పుబడుతున్నారు. 
 
ఈ క్రమంలో విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాస రావు ఈ ప్లాంట్ కోసం తన ఎమ్మెల్యే పదవిని త్యజించారు. అలాగే, స్టీల్ ప్లాంట్ అంశంపై కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీని కలిసి ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేలా పోరాడాలన్నారు. స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపైకి రావాలని గంటా శ్రీనివాసరావు పిలుపు ఇచ్చారు. 
 
కేంద్రానికి సీఎం జగన్‌ రాసిన లేఖను స్వాగతిస్తున్నామన్నారు. అయితే లేఖలు రాస్తే ఢిల్లీలో పెద్దల మనసు కరగదన్నారు. అసెంబ్లీ ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర కేబినెట్‌ భేటీ పెట్టాలని, తెలంగాణ తరహా మిలియన్‌ మార్చ్‌ చేయాలని గంటా శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.