1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (12:46 IST)

కర్నూలులో అమిత్ షా సభ పెడతాం... అనుమతి తీసుకోం.. : సీఎం రమేష్

cmramesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయండాన్ని ఒక్క వైకాపా మినహా మిగిలిన అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడుతూ, మీరు ప్రతిపక్షాలను ఎంతగా అణిచివేయాలనుకుంటే అంతకంటే ఎక్కువగా ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకునిపోయివుందన్నారు. రాబోయే రోజుల్లో వడ్డీలు కట్టేందుకు అవసరమైన అభివృద్ధి కూడా ఏపీలో జరగలేదన్నారు. దీని గురించి ఆలోచన చేయకుండా ప్రతిపక్షాలను గొంతు నొక్కేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. 
 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన రోడ్లపై ప్రమాదాలు సంభవిస్తే రోడ్లపై జనాలు తిరగకుండా చేస్తామా? అని ఆయన ప్రశ్నించారు. ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదన్నారు. ఆ బాధ్యతను విస్మరించి, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను మీడియా ద్వారా తెలియనీయకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే వైకాపా ప్రభుత్వం ఈ పాడు పనికి పూనుకుందన్నరు. 
 
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్నూలుకు వస్తున్నారని, ఈ సందర్భంగా బీజేపీ ర్యాలీ నిర్వహిస్తుందని, సభ పెడుతుందని, అలాగే, ఇతర అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని తెలిపారు. తమ పార్టీ కార్యక్రమాలకు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. సభలు పెట్టకూడదనే జీవోను వెంటనే రద్దు చేసి మీ తప్పిదాలను ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచన చేస్తే మంచిదని ఆయన హితవు పలికారు. 
 
పోలీసులు ప్రభుత్వ కార్యక్రమాలకు ఒక విధంగా, ప్రతిపక్షాల కార్యక్రమాలకు మరో విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రజలు, ఉద్యోగులు వైకాపా ప్రభుత్వంతో విసిగిపోయారని, ఎపుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం కూడా ఇదేవిధంగా ఆలోచించి వుంటే జగన్ ఒక్క అడుగు కూడా పాదయాత్ర చేసేవాడు కాదని, జగన్ పాదయాత్రకు ప్రభుత్వం కట్టుదిట్టంగా రక్షణ కల్పించిందని ఆయన గుర్తుచేశారు.