శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (08:58 IST)

స్నేహితులతో భార్యను అత్యాచారం చేయించిన భర్త... ఎక్కడ?

కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. కలహాలు వద్దు కలిసి కాపురం చేద్దామంటూ ప్రాధేయపడిన భార్యపై తన స్నేహితులతో కలిసి లైంగికదాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో అపస్మారక స్థితిలోకి జారుకున్న భార్యను నడి రోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా నగరంపాలెంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన షేక్‌ మీరావలి అలియాస్‌ బాబుకు అదే ప్రాంతానికి చెందిన మహిళతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. మనస్పర్థల కారణంగా కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. 
 
ఈ నెల 17న భార్య బంధువులు, బాబు మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో బాబు నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై అదేరోజు వివాదాలు ఎందుకని, కలిసి ఉందామని అడిగేందుకు భార్య.. భర్త బాబు ఇంటి వద్దకు వెళ్లింది.
 
ఆ సమయంలో భర్త బాబు, అతని స్నేహితులు రబ్బాని, సలీంలు కలిసి మద్యం తాగుతున్నారు. వివాదాలు వద్దని కేసులు విత్‌డ్రా చేసుకుని జీవనం సాగిద్దామని అడిగేందుకు వెళ్లిన భార్యపై భర్త బాబు, అతని స్నేహితులు రబ్బాని, సలీం కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. కొద్దిసేపటికి రోడ్డుపై పడివున్న ఆమెను బంధువులు, స్థానికులు ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.