1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 3 మే 2018 (18:45 IST)

నిధుల కోసం కేంద్రం ముందు మోకరిల్లాలా? యనమల ప్రశ్న

అమరావతి : 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లాల్సి వస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఈ నెల 7వ తేదీన సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్‌లో హాలులో 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చకు 11 రాష్ట

అమరావతి : 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లాల్సి వస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఈ నెల 7వ తేదీన సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్‌లో హాలులో 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చకు 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు, ఆర్థిక నిపుణులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో ఉన్న తన కార్యాలయంలో పలు శాఖలకు చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శులతో గురువారం సమావేశం నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై ఈ నెల 7 వ తేదీన నిర్వహించే సమావేశం ఏర్పాట్లపై ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దిశానిర్దేశం చేశారు. 
 
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా 11 రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్నాటక, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పాండిచ్ఛేరి, సిక్కిం, మేఘాలయ, మిజోరమ్ రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాలు త్రివేండ్రంలో సమావేశమయ్యాయన్నారు. తదుపరి సమావేశం అమరావతిలో నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 7 వ తేదీన అమరావతిలో ఉన్న సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాలులో 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై సమావేశం నిర్వహించడానికి నిర్ణయించామన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయాలించాలని చూస్తోందన్నారు. 
 
క్రమశిక్షణతో అభివృద్ధి బాటలో పయనించే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాల్సిందిపోయి, వాటిని ఆర్థికంగా కుంగదీయాలనుకోవడం సరికాదన్నారు. ఇప్పటికే వెనుకబడి రాష్ట్రాల పేరుతో కొన్ని రాష్ట్రాలకు 20 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు కుమ్మరిస్తోందన్నారు. ఇప్పటికీ ఆ రాష్ట్రాలు ఆర్థికంగా ఎంతో వెనుబడే ఉన్నాయన్నారు. ఇపుడు 15 వ ఆర్థిక సంఘం సిఫార్సుల పేరుతో మరోసారి అభివృద్ధిచెందుతున్న రాష్ట్రాలకు నిధుల మంజూరులో మొండిచేయి చూపడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. 
 
2011 జనాభా ప్రాతిపదికగా నిధులు కేటాయించాలన్న15వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా ఏపీకి ఏటా 8 వేల కోట్ల వరకూ ఆర్థికంగా నష్టం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేసిన వారికి ప్రోత్సాహాలు అందజేస్తామంటూ కేంద్రం ఆశ చూపిస్తోందన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు గండిపడుతుందన్నారు. నిధుల కోసం తన ఎదుట మోకారిల్లేలా చేసి, రాష్ట్రాల హక్కులను కాలరాసి, వాటిపై పెత్తనం చెలాయించాలని కేంద్రం చూస్తోందన్నారు. 1971 జనాభా ప్రాతిపదికగా నిధులు కేటాయించాలని కోరుతున్నామన్నారు. ఇందుకోసమే 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు, ఆర్థిక నిపుణులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో 15 వ ఆర్థిక సంఘం సిఫార్సులకు వ్యతిరేకంగా తీర్మానం చేసి, రాష్ట్రపతి కోవింద్ దృష్టికి తీసుకెళ్లనున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.