గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 జులై 2024 (09:23 IST)

అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా... బెంగుళూరు ప్యాలెస్‌కు మాజీ సీఎం జగన్?!!

ys jagan
వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు బెంగుళూరులోని తన సొంత ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. సోమవారం బెంగుళూరుకు చేరుకునే ఆయన వారం రోజుల పాటు అక్కడే ఉంటారు. నిజానికి గత ఎన్నికల్లో వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత ఆయన తాడేపల్లి నుంచి పులివెందుల, అక్కడ నుంచి హైదరాబాద్, అక్కడ నుంచి బెంగుళూరుకు చేక్కేశారు. జూన్ 27వ తేదీన బెంగుళూరుకు వెళ్లిన జగన్.. జూలై ఒకటో తేదీ వరకు అక్కడే ఉన్నారు. ఇపుడు కేవలం రెండు వారాల వ్యవధిలో మరోమారు ఆయన అక్కడకు వెళ్లనున్నారు. 
 
నిజానికి ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నాటికి ఆయన తిరిగి వస్తారా.. లేదా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరుపై వైకాపా నుంచి కానీ.. ఆ పార్టీ శాసనసభాపక్షం నుంచి కానీ ఇప్పటికీ స్పష్టత రాలేదు. బెంగుళూరుకు వెళ్లే జగన్ వారం రోజుల పాటు అక్కడే ఉండే అవకాశం ఉండటంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే అవకాశాలే మెరుగ్గా ఉన్నాయి. 
 
మరోవైపు, సోమవారం నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు సమాచారం పంపారు. ఇందులో పార్టీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని జగన్ కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందే అది వాయిదా పడింది. 
 
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ప్రజల్ని కలిసేందుకని రూపొందించిన స్పందన ప్రారంభం కాకుండా వాయిదాలతోనే ఐదేళ్లు గడిపేశారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ప్రజల్ని కలిసే కార్యక్రమాల్ని వాయిదాలు వేస్తున్నారు. దీంతో సొంత పార్టీ నేతలే తమ అధినేత జగన్ మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన ఉండదని, ఆయన మాటలు ఒట్టి మాటలేనంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించుకుంటున్నారు.