గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (15:25 IST)

వైఎస్ షర్మిలను చూసి దూరంగా పారిపోతున్న వైసిపి నాయకులు, ఎందుకో?

కడప జిల్లాలో జరిగే కార్యక్రమం ఏదైనా సరే సీఎం జగనే కాదు, వైఎస్‌ విజయలక్ష్మి, వైఎస్‌ షర్మిల ఎవరు హాజరైనా జిల్లాకు చెందిన వైసీపీ కీలక నాయకులు వచ్చి వారిని కలుస్తుంటారు. వారితోనే ఉంటారు. అమ్మా.. అన్న అని సంబోధిస్తూ పర్యటన ఆసాంతం వెంటే ఉంటారు. గతంలో ఇదే జరిగేది. 
 
కానీ, సోమవారం పులివెందుల పట్టణానికి జగన్‌ తల్లి విజయలక్ష్మి, ఆయన చెల్లెలు వైఎస్‌ షర్మిల వచ్చిన సందర్భంగా పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించింది. బంధువులు, వైఎస్‌ కుటుంబ సన్నిహితులు తప్ప అధికారపక్ష నేతలంతా కంటికి కనిపించలేదు. 
 
తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించిన తర్వాత, తొలిసారి షర్మిల తన తల్లితో కలిసి పులివెందుల వచ్చారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి రెండో వర్ధంతి కార్యక్రమంలో వారు పాలుపంచుకొన్నారు. అనంతరం షర్మిల వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌కు చేరుకొని తన తండ్రి సమాధి వద్ద నివాళులు ఆర్పించారు. 
 
మరోవైపు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి 2019 మార్చి 14 అర్థరాత్రి తర్వాత పులివెందులలో తన స్వగృహంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. వివేకా రెండో వర్ధంతిని పురస్కరించుకొని డిగ్రీ కళాశాల రోడ్డుకు సమీపంలో ఉన్న వైఎస్‌ కుటుంబీకుల సమాధుల ప్రాంగణంలో సోమవారం ఆయన సమాధి వద్ద పలువురు కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 
 
ఆయన స్మారకార్థం నిర్మించిన చిన్నపిల్లల పార్కును ప్రారంభించారు. అయితే, ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి (రాజశేఖర్‌ రెడ్డి తండ్రి రాజారెడ్డి తమ్ముడి కుమారుడు) కుటుంబ సభ్యులు హాజరుకాలేదని స్థానికులు పేర్కొన్నారు. కాగా, వివేకా హత్య ఘటనపై ఆయన కూతురు మారెడ్డి సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల జాబితాలో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డిల పేర్లు ఉన్న విషయం తెల్సిందే.