1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (19:30 IST)

షర్మిల పార్టీ పేరు లీక్ - పార్టీ జెండాలో మూడు రంగులు? (video)

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఇపుడు ఈ పార్టీ పేరు బయటకు పొక్కింది. అయితే, పార్టీ పేరును అధికారికంగా ప్రకటించక ముందే ఆమె పార్టీ పేరు, జెండా, అజెండాపై ప‌లు అంశాలు లీక్ అవుతున్నాయి. 
 
త‌న తండ్రి పేరు క‌లిసివ‌చ్చేలా పార్టీకి  వైఎస్‌ఆర్ ‎టీపీగా పేరు పెట్టాల‌ని ష‌ర్మిల భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే, పార్టీ జెండాలో మూడు రంగులు ఉండేలా ఆమె చూసుకుంటున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. అందులో ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులు ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 
 
వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీనే లక్ష్యంగా ఆమె ఇప్పటి నుంచే వ్యూహంగా అడుగులు వేస్తున్నారు. అలాగే, తాను కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏదైనా ఓ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు హైదరాబాద్‎లోని ఓ నియోజకవర్గంలో పోటీ చేయాల‌ని ఆమె భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.
 
ఇప్ప‌టికే ష‌ర్మిత ప‌లు జిల్లాల నేత‌ల‌తో ఆత్మీయ సమావేశాలను నిర్వహించారు. అలాగే, ఈ నెల‌ 19న కరీంనగర్ జిల్లా అభిమానులతో స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశాలు ముగిశాక ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో జరిగే భారీ సభలో ఆమె త‌న‌ పార్టీ జెండాను ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిసింది. 
 
కాగా, షర్మిల అన్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రి పేరు కలిసివచ్చేలా వైఎస్ఆర్ సీపీని స్థాపించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. ఈయన జెండాలో కూడా మూడు రంగులు ఉన్నాయి.