శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (15:15 IST)

వైఎస్ఆర్ జయంతి రోజున వైఎస్.షర్మిల కొత్త పార్టీ!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ స్థాపన తథ్యమైపోయింది. తెలంగాణా రాష్ట్రంలో కొత్త పార్టీని స్థాపించనుంది. ఈ పార్టీ స్థాపనకు కూడా ముహుర్తాలను కూడా ఆమె ఖరారు చేసుకున్నట్టు సమాచారం. ఇందుకోసం రెండు తేదీలను ఎంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వీటిలో ఒకటి మే 14వ తేదీ కాగా, మరొకటి జూలై 8వ తేది. ఈ రెండు తేదీలకు ఓ ప్రత్యేకత ఉంది. వైఎస్. షర్మిల తండ్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో తేదీ అయిన జూలై 8.. వైఎస్ఆర్ జయంతి. ఈ రెండు తేదీల్లో ఒక తేదీన కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయాలని భావిస్తున్నారు. 
 
ముఖ్యంగా, ప్రజల గుండెల్లో చెరగిపోని స్థానాన్ని వైఎస్ఆర్ సంపాదించుకున్నారు. దీంతో ఆయన జయంతిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. దీంతో వైఎస్ఆర్ జయంతి రోజునే పార్టీ వ్యవస్థాపక తేదీగా షర్మిల ఎంచుకున్నట్టు ఆమె సన్నిహితుల మాటగావుంది. 
 
కాగా, షర్మిల ఇప్పటికే పార్టీ ఏర్పాటు అంశంపై వివిధ జిల్లాలకు చెందిన నేతలతో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అలాగే, ఒక్కో జిల్లాలో ఈ తరహా సమావేశాలు నిర్వహించి, స్థానిక నేతలు ఇచ్చే సూచనలు, సలహాలతో పార్టీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.