శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (08:15 IST)

వైకాపా - టీడీపీ - జనసేన అన్నీ బీజేపీ ఒకేగూటి పక్షులు : కేవీపీ

kvp ramachandrarao
వైఎస్ఆర్ ఆత్మగా పేర్కొనే డాక్టర్ కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని అధికార వైకాపా, విపక్ష టీడీపీ, జనసేన పార్టీలన్నీ ఒకే గూటి పక్షులని ఆరోపించారు. పైగా, 30 మందికిపైగా ఎంపీలు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ అప్రజాస్వామిక చర్యలను ప్రశ్నించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, వైఎస్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రులు అయితే కాదు.. రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయితేనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ సంతోషిస్తుందని ఆయన అన్నారు.
 
విజయవాడ కేంద్రంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ జరిగింది. ఇందులో కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ, వైఎస్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రులు కావడం కంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే వైఎస్ఆర్ ఆత్మ సంతోషిస్తుందని తెలిపారు. పార్లమెంటులో వైకాపా, టీడీపీలకు చెందిన 36 మంది ఎంపీల బలం ఉందన్నారు. అయినప్పటికీ ప్రధాని మోడీ అప్రజాస్వామిక చర్యలను ప్రశ్నించలేకపోతున్నందుకు ఓ తెలుగువాడిగా సిగ్గుపడుతున్నట్టు చెప్పారు. 
 
వైకాపా, టీడీపీ, జనసేన పార్టీలన్నీ బీజేపీ పక్షులేనని ఆరోపించారు. అదానీ అక్రమాలపై వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏపీసీసీ వ్యవహారాల ఇన్‍‌ఛార్జ్ వీరప్ప మొయిలీ, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, పల్లంరాజు, కనుమూరి బాపిరాజు, ఎన్.రఘువీరా రెడ్డి, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.