మంగళవారం, 9 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (12:40 IST)

జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సలహాలు ఇవ్వలేదంటే... వైఎస్ ఆత్మ కేవీపీ

kvp ramachandrarao
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించివున్న సమయంలో వైఎస్ ఆత్మగా పేర్కొనే కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ కేవీపీ రామచంద్రరావు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వక పోవడానికిగల కారణాలను ఆయన వెల్లడించారు. జగన్‌కు ఎందుకు సలహాలు ఇవ్వడం లేదో వివరించగలను. కానీ ఇపుడు చెప్పలేనని అన్నారు. 
 
ఇకపోతే, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబు ముందు నడుస్తుంటే ఆయన వెనుక తాము నడుస్తామని తెలిపారు. 'బాబు శక్తి సామర్థ్యాలు తక్కువేం కాదు.. ఎంతో రాజకీయ చతురత ఉంది. దేశ రాజకీయాలకు కేంద్ర బిందువు కాగల శక్తి ఉంది. ఎన్డీఏ కన్వీనర్‌గా పనిచేశారు. ఢిల్లీలో చక్రం తిప్పారు. దేశంలో రాజకీయ పరిస్థితులపై పోరాటంలో మీరు ముందుండండి.. మీ వెనక మేము ఉంటాం' అని అన్నారు. 
 
ప్రస్తుతం కేవీపీ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడుగా ఉన్నారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టిన వారు.. మైత్రీ బంధం వల్ల ప్రశ్నించలేకపోయినా.. తప్పును తప్పు అని చెప్పాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. 
 
గతంలో చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టినప్పుడు కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, మన్మోహన్‌సింగ్‌ వచ్చి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఏపీలో 25 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 175 ఎమ్మెల్యేలు ఉంటే.. ఒక్కరూ నోరు మెదపలేదని కేవీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రత్యేక పరిస్థితుల్లో భాజపాను వ్యతిరేకించి మాట్లాడటం లేదన్నారు. ఆ ప్రత్యేక పరిస్థితులేమిటో మరోసారి వివరిస్తానని చెప్పారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ, పారిశ్రామికవేత్త అదానీలు అవిభక్త కవల పిల్లలని కేవీపీ అభివర్ణించారు. మోడీ పీఎం అయిన తర్వాతే అదానీ ఆస్తులు పెరిగిపోయాయన్నారు. మనం చెల్లించే విద్యుత్తు బిల్లులో పైసాపైసా అదానీకి, అక్కడి నుంచి మోడీకి వెళుతున్నాయని ఆరోపించారు.