గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (17:56 IST)

విజ్ఞులైన తిరుపతి ఓటర్లు ఒకసారి ఆలోచించాలి : వైకాపా ఎమ్మెల్యే

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఓటర్లకు ఒక విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవలి పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పట్ల పూర్తి సంతృప్తి చూపిన ప్రజలు దాదాపు 85 శాతం వైయస్సార్‌సీపీని గెలిపించారు. అయితే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఆయనకు మతి భ్రమించిందా అని కూడా అనిపిస్తుంది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఇద్దరూ గతి తప్పి మాట్లాడుతున్నారు.
 
2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రభుత్వం, ఆ తర్వాత మేనిఫెస్టోను కూడా దాచేసి ప్రజలను మోసం చేసింది. మరి ఆ పార్టీ కావాలో, లేకపోతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 95 శాతం 20 నెలల్లోనే అమలుచేసిన శ్రీ వైయస్‌ జగన్‌ కావాలో విజ్ఞులైన ఓటర్లు ఆలోచించాలి.
 
ఈ ప్రభుత్వం వచ్చాక ఏం చేసిందని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. కోవిడ్‌తో ఆర్థిక సంక్షోభం తలెత్తిగా ఎక్కడా ఏ సంక్షేమ కార్యక్రమం, పథకాన్ని ఆపలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం 20 నెలల్లోనే 95 శాతం అమలు చేశాం. గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలు అవినీతికి మారుపేరుగా మారాయి. కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడా వివక్ష, కులం, మతం, రాజకీయం, వర్గం చూడకుండా పథకాలు అమలు చేస్తున్నాము.
 
గతంలో కేవలం 44.48 లక్షల మందికి మాత్రమే రూ.1000 పెన్షన్‌ ఇస్తే, ఈ ప్రభుత్వం దాదాపు 63 లక్షల మందికి రూ.2,250 పెన్షన్‌ ఇస్తున్నాం. ఇంత మందికి అర్హత ఉన్నా, ఆరోజు పెన్షన్‌ ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. పైగా ఇప్పుడు ఇంటికే వెళ్లి పెన్షన్‌ అందజేస్తున్నాము. నాడు బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు.
 
కానీ ఈ ప్రభుత్వం గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం పాటు పడుతోంది. అందుకే 10 రకాల సేవలకు సంబంధించిన ఉద్యోగులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించడం జరిగింది. ప్రతి 2 వేల ఇళ్లకు ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా దాదాపు 1.36 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలతో పాటు, దాదాపు 2.7 లక్షల మందిని వలంటీర్లుగా నియమించి ఉపాధి కల్పిస్తున్నాం. 
 
నాడు ప్రభుత్వ విద్యా సంస్థలను, స్కూళ్లను నిర్వీర్యం చేసి ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించారు. కానీ ఈ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లలకు అండగా నిలుస్తున్నాం. ఇంకా దాదాపు 44 లక్షల తల్లులకు అమ్మ ఒడిలోసహాయం చేస్తూ, పిల్లలను బడికి పంపేలా చేస్తున్నాము.
 
చంద్రబాబు నాడు–నేడు మనబడి కార్యక్రమాన్ని విమర్శిస్తున్నాడు. ఆయనకు కళ్లుంటే, ఏదైనా ఒక స్కూల్‌కు వెళ్లి, అక్కడ జరుగుతున్న పనులు చూడాలి. నాడు–నేడులో కేవలం పెయింటింగ్‌ మాత్రమే వేయడం లేదు. ఈ చర్యలన్నింటి వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది కంటే దాదాపు 20 శాతం విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగింది.
 
ఆరోగ్యశ్రీలో ఏకంగా 2434 జబ్బులకు వైద్యం అందిస్తున్నాం. గతంలో అలా లేదు. అంతే కాకుండా రూ.1000 వైద్యం ఖర్చు దాటిన ప్రతి చికిత్సను పథకంలో చేర్చడం జరిగింది. 1000కి పైగా కొత్త వాహనాలు.. 108, 104 సర్వీసులు ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో కేవలం తెల్లకార్డు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేయగా, ఇవాళ రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ పథకం అమలు చేస్తున్నాం.
 
వ్యవసాయ రుణాలు దాదాపు రూ.90 వేల కోట్లు మాఫీ చేస్తానని చెప్పి, నాడు అధికారం చేపట్టిన చంద్రబాబు, కేవలం రూ.13 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి రైతులను మోసం చేశాడు. కానీ ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఇంకా ఎక్కువే ఇస్తోంది. పెట్టుబడి సాయంగా ఏటా రూ.12,500కు బదులు రూ.13,500 చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ.67,500 ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయంగా ఇస్తున్నాం. రైతులకు సున్నా వడ్డీ పథకం అమలు చేస్తున్నాము.
రైతుల పంటలకు గిట్టుబాటు ధర రావడం కోసం ఈ 20 నెలల కోసం దాదాపు రూ.4800 కోట్లు ఖర్చు చేసి వాణిజ్య పంటలు కొనుగోలు చేయగా, మరో రూ.15 వేల కోట్లు ఖర్చు చేసి ఇతర పంటల ఉత్తత్తులు కొనుగోలు చేయడం జరిగింది.
 
 
రైతులకు విత్తనాలు మొదలు, చివరకు పంటలు అమ్ముకునే విధంగా ప్రతి అడుగులో వారికి తోడుగా నిలబడేందుకు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 31 లక్షల నిరుపేద కుటుంబాలలో అక్క చెల్లెమ్మల పేరుతో ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేయడం జరిగింది. వాటిలో ఇప్పటికే దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం చేపట్టింది. 
 
 
అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని గతంలో చెప్పిన చంద్రబాబు, వారికి కూడా గుండుసున్నా చుట్టాడు. కానీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుని డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేశారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం రూపొందించడంతో పాటు, ప్రత్యేక పోలీసు స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు కూడా తగిన గుర్తింపు ఈ ప్రభుత్వంలో లభిస్తోంది.
 
014 నుంచి 5 ఏళ్ల పాటు జగన్‌గారి కుటుంబంపై బురద చల్లడమే ధ్యేయంగా చంద్రబాబు, ఆయన కుమారుడు పని చేశారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. అందుకే ఆరోపణలు, విమర్శలు. వైయస్‌ వివేకానందరెడ్డి హత్యలో తమ కుటుంబం ప్రమేయం లేదని జగన్‌గారు ప్రమాణం చేస్తారు. మరి మీరు అదే ప్రమాణానికి సిద్ధంగా ఉన్నారా? ఆ హత్యపై నాడు జగన్‌ గారు సీబీఐ దర్యాప్తు కోరారు. అధికారంలోకి వచ్చాక సిట్‌ ఏర్పాటు చేసి, కేసు దర్యాప్తు వేగం చేయాలని నిర్ణయించగా, వివేకానందరెడ్డి గారి కుమార్తు, సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టుకు వెళ్లారు. అందుకే కేసును సీబీఐకి అప్పగించడం జరిగింది. 
 
– నాడు వైయస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు పరిటాల హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించారు. హత్యలు చేయడం తెలుగుదేశం నైజం. ఆ సంస్కృతి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి లేదని వ్యాఖ్యానించారు.