శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 8 జులై 2019 (19:04 IST)

చేతగాని నేత నారా లోకేష్: ఉండవల్లి శ్రీదేవి, పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతారో తెలుసా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. మాట్లాడటం చేతకాని వ్యక్తి నారా లోకేష్ అంటూ ధ్వజమెత్తారు. నారా లోకేష్ భవిష్యత్ సీఎం అవుతారంటూ టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఒక జోక్ అంటూ అభిప్రాయపడ్డారు. 
 
ఒక నియోజకవర్గంలోనే గెలవలేని వ్యక్తి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను గెలిపిస్తాడా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ నారా లోకేష్ సీఎం అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉండవల్లి శ్రీదేవి సవాల్ విసిరారు. 
 
మరోవైపు మాట ఇస్తే తప్పని నాయకుడు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి అని ప్రశంసించారు. అయితే ఇచ్చిన మాట తప్పేవాడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడం వాటిని గాలికొదిలేయడం అలవాటు అని అందువల్లే ఆయన మాట తప్పేనేత అంటూ ఘాటుగా విమర్శించారు. 
 
ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఒకదానికి ఒకటి పొంతన ఉండదని ఎమ్మెల్యే విమర్శించారు. 
 
ఉండవల్లి శ్రీదేవి 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి శ్రవణ్ కుమార్ పై డాక్టర్ శ్రీదేవి ఘన విజయం సాధించారు. వైయస్ జగన్ ప్రభుత్వం అద్భుత పాలన అందించబోతుందని అందులో ఎలాంటి సందేహం లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు.