శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

సిగ్గుండాలి.. అలా అనడానికి.. ఓడిపోయి రెండేళ్లు అయింది.. : విజయసాయి

టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు మాటలతో దాడిచేశారు. నేనేం తప్పు చేశానో తెలియదు అంటూ చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యానించడంపై విజయసాయి స్పందించారు. 
 
"నేనేం తప్పు చేశానో నాకు తెలియదు. నన్ను క్షమించండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే నేను చేసిన తప్పా" అంటూ ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. 
 
'చిత్తుగా ఓడిపోయి రెండేళ్లవుతున్నా ఎలా ఓడిపోయాడో తెలియదంట సంక్రాంతి సృష్టికర్తనని చెప్పుకునే బాబుకి. పైగా సారీ.. పూర్తిగా మారిపోయానంటూ కొత్త డ్రామాలు మొదలెట్టారు. ఎన్నిసార్లు మారతారు బాబు గారూ? దేవాలయాలు ధ్వంసం చేస్తూ తన ఓటమికి ఇంకా ప్రజల్నే నిందిస్తున్నాడు' అని విజయసాయిరెడ్డి విమర్శించారు. 
 
'అమూల్ రాకతో వరి పండించే రైతులే కాదు పాడి రైతులు కూడా అదనపు ఆదాయంతో ఆనందంగా ఉన్నారు. మరి రాష్ట్రం ఇచ్చిన జీవోలను  భోగిమంటల్లో వేయమంటారేంటి చంద్రబాబు గారూ? హెరిటేజ్ కంపెనీ ఆదాయం తగ్గినా లక్షలాది రైతులకు లాభం జరిగిందిగా! రైతు బాగుపడితే మీకు అంత కడుపుమంట ఎందుకు?' అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
 
పాదయాత్ర సమయంలో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న ఆర్థిక నేరస్తుడు, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి పూనకం వచ్చినట్టుగా ఓట్లు వేశారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రజా వ్యతిరేక జీఓ కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
 
నేనేం తప్పు చేశాను..  చంద్రబాబు 
రాష్ట్ర విడిపోయిన తర్వాత నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపట్టానని, కానీ, ఐదేళ్ళ కాలంలో తానేం తప్పు చేశానో తెలీదన్నారు. అదేసమయంలో జగన్ నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్లు ఓట్లేశారని, అందుకు ప్రతిఫలాన్ని ఇపుడు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారన్నారు.
 
ప్రజలంతా అభివృద్ధి చెందాలని కృషి చేశానని...అదే తాను చేసిన తప్పైతే తనను క్షమించాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. రాష్ట్రంలో రైతులు ఎక్కడా ఆనందంగా లేరన్నారు. రైతు కూలీలు చితికిపోయారని తెలిపారు. ప్రజావ్యతిరేకతపై నిర్ణయాలు మీద నిర్ణయాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
 
ప్రజావేదిక కూల్చి ఇంతవరకు శిథిలాలు తీయకుండా పైశాచిక ఆనందం పొందే శాడిస్టు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక డెకాయిట్ మాదిరి వ్యవహరిస్తున్నారన్నారు. బెట్టింగ్ మంత్రులు, మైనింగ్ మాఫియా వాళ్ళు, బూతులు మంత్రులు తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు బకాయిలు ఇంతవరకు చెల్లించలేదన్నారు.
 
రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. పేదల రక్తం తాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రైతులకు మద్దతు ధర ఉండటంతో పాటు మార్కెట్ కమిటీలు కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.
 
మీటర్లు వ్యవసాయ మోటర్లకు కాదు మంత్రులకు పెట్టాలని వ్యాఖ్యానించారు. వైసీపీ మంత్రులకు మీటర్లు పెడితే ఏ మంత్రి ఎంత దోచుకుంటున్నారో రియల్ టైమ్‌లో తెలుస్తుందన్నారు. ఫించన్లు పెంచుకుంటూ పోతానని మోసాగిస్తున్నారన్నారు. అప్పుల కోసమే మీటర్లు పెడుతున్నారని ఆరోపించారు.
 
పట్టణాల్లో అన్నింటి పైనా పన్నులే అని... పెంపుడు జంతువుల పైనా పన్నులు విధిస్తున్నారని దుయ్యబట్టారు. గాలి రెడ్డి కాబట్టి రేపోమాపో గాలిపైనా పన్ను వేస్తారని యెద్దేవా చేశారు. రాష్ట్రానికి రెండు కళ్లయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.