శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జులై 2020 (17:03 IST)

నరసాపురం ఎంపీ సంగతి తేల్చేద్ధాం : ప్రత్యేక విమానంలో హస్తినకు వైకాపా ఎంపీలు

పార్టీలో రెబెల్ ఎంపీగా ఉన్న నరసాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు సంగతి అటో ఇటో తేల్చాలన్న పట్టుదలతో వైకాపా నేతలు ఉన్నారు. ఇందుకోసం ఆ పార్టీకి చెందిన ఎంపీలు ప్రత్యేక విమానంలో శుక్రవారం హస్తినకు వెళ్లనున్నారు. వీరంతా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై, నరసాపురం ఎంపీ గురించి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా, పార్టీ ధిక్కరణ చర్యల కింద ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేయనున్నారు. 
 
రఘురామకృష్ణంరాజుకు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి ఇప్పటికే షోకాజ్ నోటీసులు కూడా పంపించారు. వీటికి సంజాయిషీ ఇవ్వకపోగా, ఆ షోకాజ్ నోటీసులనే ప్రశ్నించడం ద్వారా రఘురామకృష్ణరాజు మరింత ఆజ్యం పోశారు. వైసీపీ హైకమాండ్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. 
 
పార్టీకి దూరం కావాలన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణరాజు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన నరసాపురం ఎంపీ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి స్పీకర్‌ను, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తన వాదనలు వినిపించారు. రేపు వైసీపీ ఎంపీలు కూడా స్పీకర్‌ను కలవనుండడంతో ఈ అంశంలో మరింత ఆసక్తి ఏర్పడింది.