శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (12:58 IST)

బిహార్: పదకొండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్‌కు మరణ శిక్ష - ప్రెస్ రివ్యూ

బిహార్‌లో ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, ఆమె గర్భవతి కావడానికి కారకుడైన ప్రిన్సిపల్‌కు పట్నాలోని పోక్సో కోర్టు మరణశిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది. ఈ అత్యాచారం ఘటనలో ప్రిన్సిపల్‌కు సహకరించిన టీచర్‌కు జీవిత ఖైదు, రూ.50వేల జరిమానా విధించినట్లు ఈ కథనం పేర్కొంది.

 
స్కూల్‌ గంట కొట్టిన తర్వాత ఇంటికి వెళుతున్న చిన్నారిని ప్రిన్సిపల్‌ అరవింద్‌ కుమార్‌ తన గదికి పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న టీచర్‌ అభిషేక్‌ అరవింద్‌కు సహకరించాడు.

 
కొన్నాళ్ల తర్వాత కడుపులో నొప్పి అంటూ చిన్నారి బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో చిన్నారి గర్భవతి అని తేలింది. బాలిక చెప్పిన వివరాల ప్రకారం తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌ మీదా, అతనికి సహకరించిన టీచర్‌ మీదా ఫిర్యాదు చేశారు.

 
ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికల్లో నేరం నిరూపణ కావడంతో పొక్సో చట్టం కింద శిక్ష విధించారు. 2018లో నమోదైన ఈ కేసును ఓ అరుదైన కేసుగా పోక్సో కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.