శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 15 అక్టోబరు 2019 (12:40 IST)

విజయవాడ, దిల్లీ సహా 50 నగరాలకు భూకంపం ముప్పు - ట్రిపుల్ ఐటీ, ఎన్‌డీఎంసీ నివేదిక : ప్రెస్ రివ్యూ

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడతో పాటు దేశ రాజధాని దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి తదితర 50 నగరాలు అధిక భూకంప ముప్పు మండలాల్లో ఉన్నాయని తాజా అధ్యయనంలో గుర్తించినట్లు 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ), భారత ప్రభుత్వం సంయుక్తంగా ఈ భూకంప విపత్తు ముప్పు సూచిక (ఎర్త్‌క్వేక్ డిజాస్టర్ రిస్క్ ఇండెక్స్) నివేదికను ప్రచురించాయి.
 
ప్రభావిత ప్రాంతాల్లోని జనసాంద్రత, గృహనిర్మాణం, నగరాల పరిస్థితి ఆధారంగా ప్రయోగాత్మకంగా అధ్యయనం చేపట్టారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లోని ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ విభాగ అధిపతి ప్రొఫెసర్ ప్రదీప్ రామనచర్ల సారథ్యంలో పరిశోధక విద్యార్థులు మూడేళ్ల పాటు శ్రమించి నివేదికను రూపొందించారు. దీనిని ఐఐటీ ప్రొఫెసర్లు, ప్రభుత్వ యంత్రాంగం సమీక్షించినట్లు ప్రదీప్ తెలిపారు.
 
దేశవ్యాప్తంగా విజయవాడ సహా 50 నగరాలు.. ఒక జిల్లా అధిక భూకంప ముప్పు గల మండలాల్లో ఉన్నట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు. ఈ 50 నగరాల్లోనూ 13 నగరాలు అధిక ప్రమాదకర స్థాయి, 30 మధ్యస్థ, 7 నగరాలు తక్కువ ప్రమాదకర స్థాయిల్లో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అధిక భూకంప మండలంలో విజయవాడ, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, పుణె, ముంబై, అహ్మదాబాద్, సిలిగురి, డార్జిలింగ్, చండీగఢ్ తదితర నగరాలు ఉన్నట్లు తెలిపారు.