గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (12:30 IST)

2జీ, 3జీ వినియోగదారులకు ఉచిత వాయిస్ కాల్స్.. బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్

ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు రిలయన్స్ జియోను తట్టుకుని నిలబడటానికి నానా తిప్పలు పడుతున్నాయి. మరోవైపు.. ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం రిలయన్స్ జియోకు ధీటుగా పోటీ ఇస్తూ రోజుకో సరికొత్త

ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు రిలయన్స్ జియోను తట్టుకుని నిలబడటానికి నానా తిప్పలు పడుతున్నాయి. మరోవైపు.. ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం రిలయన్స్ జియోకు ధీటుగా పోటీ ఇస్తూ రోజుకో సరికొత్త ప్రకటన చేస్తోంది. 249 రూపాయలకే అపరిమిత ఇంటర్నెట్ అని ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. అయితే ఇది కేవలం బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే. 
 
కానీ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లను పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచేలా, రిలయన్స్ జియోకు దిమ్మతిరిగేలా ఓ సరికొత్త ప్లాన్‌కు రూపకల్పన చేస్తోంది. రిలయన్స్ జియో ఏ వ్యూహంతో అయితే కస్టమర్లను తన వైపుకు తిప్పుకుందో... అదే వ్యూహంతో బీఎస్‌ఎన్‌ఎల్ దెబ్బకొట్టాలని భావిస్తోంది. అంటే.. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా ఫ్రీ వాయిస్ కాల్స్‌కు... ఫ్రీ వాయిస్ కాల్స్‌తోనే సమాధానం చెప్పేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
 
ఇందులోభాగంగా, ఈ ప్లాన్ ప్రకారం బీఎస్ఎన్‌ఎల్ 2జీ, 3జీ వినియోగదారులకు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితంగా అందించాలని సంస్థ భావిస్తోంది. వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తేవాలని సంస్థ యోచిస్తోంది. దీని ప్రకారం 2-4 రూపాయల నెలవారి టారిఫ్‌తో వాయిస్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. 
 
రిలయన్స్ జియో ప్రకటించిన నెలవారి ప్లాన్ విలువ 149 రూపాయలు. దీనికంటే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ ఎన్నోరెట్లు తక్కువ. రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్లన్నీ 4జీ వినియోగదారులకు మాత్రమేనని, కానీ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టబోయే ఫ్రీ కాలింగ్ సదుపాయం 2జీ, 3జీ కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.