గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (11:35 IST)

2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్!

ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. అయితే, ఈ యేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అభివృద్ధి పనులతో పాటు.. దేశ వృద్ధిరేటు కూడా తగ్గింది. అయినప్పటికీ... వచ్చే 2030 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ తెలిపింది. 
 
అంతేకాకుండా, 2025 కల్లా బ్రిటన్‌ను అధిగమించి మళ్లీ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని అంచనా వేసింది. గతేడాదే బ్రిటన్‌ను వెనుకకు నెట్టి ఐదో స్థానంలోకి వచ్చిన భారత్‌.. కరోనా పరిస్థితుల మధ్య ఈ ఏడాది ఆరో స్థానంలోకి పడిపోయిందని సీఈబీఆర్‌ పేర్కొంది. 
 
'2019లో బ్రిటన్‌ను అధిగమించి భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అయితే మహమ్మారి తీవ్రత, డాలర్‌తో పోల్చితే రూపాయి బలహీనం మధ్య భారత్‌ తిరిగి ఆరో స్థానంలోకి పడిపోగా.. బ్రిటన్‌ ఐదో స్థానంలోకి చేరింది. 2024దాకా ఇవే స్థానాలు కొనసాగవచ్చు. 2025లో మళ్లీ భారత్‌ ఐదో స్థానంలోకి వస్తుంది' అని తమ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. 
 
అయితే, భారత వృద్ధిలో వ్యవసాయ రంగం వాటా కీలకమని తెలిపింది. ముఖ్యంగా, వ్యాక్సిన్ల తయారీలో భారత్‌ అగ్రగామిగా ఉండటం.. ఈ కరోనా పరిస్థితుల్లో కలిసొస్తున్నదని, చాలా దేశాలతో పోల్చితే వచ్చే ఏడాది భారత్‌లో ప్రజలకు వ్యాక్సిన్ల ప్రకియ విజయవంతంగా జరుగగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెడుతున్న సంస్కరణలు.. దేశానికి దీర్ఘకాలంలో మంచి చేయగలవని అభిప్రాయపడింది.
 
వచ్చే ఏడాది దేశ జీడీపీ 9 శాతం వృద్ధిని కనబర్చవచ్చని సీఈబీఆర్‌ ఈ సందర్భంగా అంచనా వేసింది. అయితే 2022లో జీడీపీ 7 శాతానికి తగ్గవచ్చన్నది. 'భారత్‌ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నకొద్దీ వృద్ధి నెమ్మదించడం సహజమే. ఈ క్రమంలోనే 2035కల్లా దేశ జీడీపీ 5.8 శాతంగానే ఉండొచ్చు' అని పేర్కొన్నది. కాగా, 2025లో బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను, 2027లో జర్మనీ, 2030లో జపాన్‌ ఆర్థిక వ్యవస్థల్ని భారత్‌ దాటేస్తుందని సీఈబీఆర్‌ చెప్తున్నది.